వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం రసాభాసాగా మారింది. సమావేశం కొనసాగుతుండగా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఎదుటనే ఎజెండా అంశంపై అధికార పార్టీ కౌన్సిలర్లు, ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల మధ్యన మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. మున్సిపల్ చైర్ పర్సన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్ ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, ఆసిఫ్ తదితర కౌన్సిలర్లు డిమాండ్ చేయగా, కౌన్సిల్ సమావేశంలో మెజారిటీ సభ్యుల ఆమోదం లేకుండానే, ఎజెండాను అధికార పార్టీ ఆమోదించడం పట్ల బిజెపి ఫ్లోర్ లీడర్ సిందూజా, కౌన్సిలర్లు బాలప్ప, సంగీత, పూజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఈ సందర్భంగా ఇరువర్గాలను పోలీసులు శాంతింప చేసినప్పటికీ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదని నివురు గప్పిన నిప్పు మాదిరే ఉన్నాయని కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న పలువురు మీడియాకు వివరాలు లీక్ చేయడం గమనార్హం.