ప్రజా సంక్షేమ పాలనను క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో గ్రామ గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు సైనికుల్లా పనిచేయాలని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి పిలుపునిచ్చారు.ఈ మేరకు విజయ నగరంలోని ఎస్వీఎన్ నగర్ లో సుజాత కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వివిధ డివిజన్ల నుండి వచ్చిన పార్టీ శ్రేణులు, గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు.
ముందుగా దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ దేశం గర్వపడే విధంగా ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న వైఎస్ జగన్ ఆశయాలను ప్రజల చెంతకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని అన్నారు. మా నమ్మకం నువ్వే జగనన్న అన్న నినాదంతో ముందుకు సాగుతూ అభివృద్ధి ఫలాలు అందుకుంటున్న లబ్ధిదారులకు జగనన్న
ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలను వివరించాలని కోరారు. 2024 లో వైఎస్ఆర్సీపీ గెలుపే లక్ష్యంగా శక్తి వంచన లేకుండా కృషి చేయాలన్నారు. ప్రతిపక్ష పార్టీల విమర్శలను ఆరోపణలను తిప్పికొట్టే విధంగా ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ విధానాలను వివరించాలని చెప్పారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకునేది పార్టీ శ్రేణులే అని అన్నారు.
నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధి నిరంతరాయంగా కొనసాగుతుందని అన్నారు. ప్రధాన జంక్షన్లో అభివృద్ధి, నిత్యం పలు వీధులలో రహదారులు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.సీఎం జగన్ అందిస్తున్న పథకాలు పొందుతున్న వారు అనేకమంది సంతృప్తి చెందుతుంటే అతి కొద్ది మంది అనర్హులైన వారు పొందలేకపోతున్న సమయంలో ప్రభుత్వ పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారని, దీనిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ శ్రేణులకు గృహ సారుదులకు సచివాలయ కన్వీనర్లకు పిలుపునిచ్చారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్ అందిస్తున్న పాలనతో ఒకవైపు, నియోజకవర్గస్థాయిలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి చేస్తున్న అభివృద్ధి మరోవైపు మొత్తంగా
ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇంటింటికి వెళుతుంటే ప్రజలలో ఆనందమే ఇందుకు తార్కాణమని అన్నారు. అభివృద్ధి దిశగా నగరాన్ని తీసుకువెళుతున్న ఘనత కోలగట్లకే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు ఆశపు వేణు, ఫ్లోర్ లీడర్ ఎస్ వి వి రాజేష్, జోనల్ ఇన్చార్జిలు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వైసిపి శ్రేణులు పాల్గొన్నారు.