వేతనాలు పెంచాలని చాలా కాలంగా కోరుతున్నా తమను పట్టించుకోని ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు చేస్తున్న ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తాము 24 గంటలు ప్రజాక్షేత్రంలో ఉంటున్నామని అలాంటి తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వారు అంటున్నారు.
తమ జీతాలు పెంచాలంటూ రాష్ట్రంలో ఎమ్మార్వో కార్యాలయం ముందు వారు నేడు నిరసన కార్యక్రమం చేపట్టారు.
కేవలం 6 వేల రూపాయల జీతంతో పని చేస్తున్న వాలంటీర్లు చాలా కాలంగా తమ వేతనాలు పెంచాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
అదే సమయంలో మొబైల్ రేషన్ షాపుల వారు ఒక్క రోజు రేషన్ సరఫరా చేయకపోయే సరికి వారి జీతం అమాంతం పెంచేశారు. దీనితో రాష్ట్ర వ్యప్తంగా వాలంటీర్లు ఆందోళన చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాలను తాము ప్రజల్లోకి తీసుకువెళుతుంటే గమనించని ప్రభుత్వం తమపట్ల చిన్న చూపు చూస్తున్నదని వారు అంటున్నారు.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ వాలంటీర్లు రోడ్డెక్కారు.
తమ జీతాలను రూ. 10,000/-వేల వరకు పెంచాలని , ప్రభుత్వం నుంచి అన్ని రకాల ప్రభుత్వ పథకాలు వర్తింపజేసేలా, వాలంటీర్స్ తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నామని కృష్ణా జిల్లా తిరువూరు వాలంటీర్లు తెలియజేశారు.
అనంతరం తిరువూరు ఎమ్మార్వో స్వర్గం నరసింహారావు కి వాలంటీర్స్ తరఫున వినతి పత్రం అందజేశారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కడప నగరంలోని కలెక్టరేట్ ఎదుట గ్రామ వాలంటీర్ల ఆందోళన నిర్వహించారు.
గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.