రాష్ట్రంలోని గ్రానైట్ కంపెనీల్లో ఈడీ జరిపిన సోదాల్లో కొత్త విషయాలు బయటపడ్డాయి. ఫెమా నిబంధనలు వుల్లంఘించినట్లు నిర్ధాంరించారు. టిఆర్ఎస్ కు చెందిన మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు సంబంధించిన కంపెనీలతోపాటు హైదరాబాద్, కరీంనగర్లోని సంస్థలు ఫెమా నిబంధనలను అతిక్రమించినట్లు ఈడీ తేల్చింది. ఈ సంస్థలన్నీ చైనా, హాంకాంగ్తోపాటు ఇతర దేశాల్లోని కంపెనీలకు చెల్లించిన రాయల్టీకి మించిన పరిమాణంలో ముడి గ్రానైట్ ఎగుమతి చేసినట్లు పూర్తి ఆధారాలతో ఈడీ నిర్ధారించింది. లెక్కల్లోకి రాని మొత్తం ఆ దేశాల నుంచి హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది.
చైనాకు చెందిన లీవెన్ హ్యూ అనే వ్యాపారి ఖాతా నుంచి గ్రానైట్ సంస్థల యజమానుల ఖాతాల్లోకి పెద్ద మొత్తంలో నగదు జమైనట్లు కూడా అధికారులు గుర్తించారు. అంతర్జాతీయంగా పన్ను ఎగవేతదారుల వివరాలతో పనామా లీక్స్ విడుదల చేసిన జాబితాలో లివెన్ హ్యూ పేరు ఉండటం విశేషం. వరుస సోదాలపై ఈడీ వర్గాలు ఓ అధికార ప్రకటన విడుదల చేశాయి.
శ్వేతా గ్రానైట్స్, శ్వేతా ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పీఎ్సఆర్ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్తోపాటు ఆయా సంస్థలకు సంబంధించి హైదరాబాద్, కరీంనగర్లో రెండు రోజులపాటు ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఆయా గ్రానైట్ కంపెనీలో పనిచేసే వారి బినామీ ఖాతాల్లోకి చైనా, హాంకాంగ్ నుంచి పెద్ద మొత్తంలో నగదు వచ్చి చేరినట్లు తేల్చారు.
చైనా, హాంకాంగ్తోపాటు ఇతర దేశాల నుంచి ఆయా ఖాతాల్లోకి వచ్చిన నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకుండా చేబదులు తీసుకున్నట్లు చెబుతున్నారని, అది సరైంది కాదని ఈడీ వర్గాలు వెల్లడించాయి. రెండు రోజులపాటు హైదరాబాద్, కరీంనగర్లోని వేర్వేరు గ్రానైట్ సంస్థల్లో నిర్వహించిన తనిఖీల్లో లెక్కల్లోలేని రూ.1.08 కోట్ల నగదుతోపాటు గడిచిన పదేళ్లుగా గ్రానైట్ ఎగుమతులకు సంబంధించిన కీలక పత్రాలు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.