ఏపి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, రాష్ట్ర మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సమాచారం సీబీఐ కి చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఆ దిశగా పావులు కదుపుతున్న సీబీఐ నిన్న రాత్రి ఒక ముఖ్యమైన వ్యక్తిని ప్రశ్నించినట్లుగా తెలిసింది. వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కు సంబంధించి ఇప్పటికే పలువురిని కష్టడీలోకి తీసుకున్న సీబీఐ ఒక ప్రముఖ దినపత్రికకు చెందిన జర్నలిస్టును కూడా అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని ముందుగా చెప్పింది ఎవరు అనే కోణంలో సీబీఐ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలిసింది.
ఆ ప్రముఖ దినపత్రిక కు చెందిన విలేకరి ఇచ్చిన సమాచారం మేరకు ఒక ప్రముఖ వ్యక్తిని సీబీఐ ప్రశ్నించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
హత్య జరిగిన రోజు రాత్రి నుంచి తెల్లవారు జాము వరకూ ఆ ముఖ్య వ్యక్తి 27 కాల్స్ మాట్టాడినట్లుగా కాల్ డేటా కూడా సీబీఐ సేకరించినట్లు తెలిసింది.
వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటం, ఆయన శిరస్సు భాగంలో గొడ్డలి వేటు కనిపించడం లాంటి అంశాలు ప్రముఖంగా కనిపిస్తున్నా ఆయన గుండెపోటుతో మరణించినట్లు ఎందుకు చెప్పారు అనే అంశంపై ఇప్పుడు సీబీఐ కీలక సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది.
మూడు రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ఇదే విషయంపై తన మీడియా సమావేశంలో సీబీఐని ప్రశ్నించిన విషయం తెలిసిందే.