విశాఖ రేంజ్ డీఐజీ రాఖీ సందేశం
పిల్లల పెంపకంలో కన్నవారు ఆడ మగ అని వ్యత్యాసం చూపకుండా, వారిని నైతిక విలువలతో పెంచాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కే.వి.రంగారావు అన్నారు. పురుషులు తమ తోబుట్టువులు పట్ల ఎంత గౌరవ, మర్యాదలతో మెలుగుతారో అదే విధంగా ఇతర స్త్రీల పట్ల అంతే మర్యాదగా ప్రవర్తించేటట్లు కన్నవారు చిన్నప్పటి నుండి దిశానిర్దేశం చేయాలన్నారు.
పిల్లలు సుహృద్భావ వాతావరణంలో మంచి నడవడికతో ఉండాలంటే పిల్లలతో కన్నవారు ఎంతో అన్యోన్యంగా ఉంటూ, వారికి మార్గదర్శకులుగా నిలవాలన్నారు.
స్త్రీలు అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా కుటుంబంలో వివిధ హోదాల్లో ఉంటారన్నారు. సమాజంలో వారి పట్ల జరుగుతున్న అత్యాచారాలు, దాడులను ప్రతీ ఒక్కరూ అడ్డుకోవాలని, ప్రతీ బాధిత మహిళను మన కుటుంబ సభ్యురాలిగా భావించి, వారికి బాసటగా నిలవాలన్నారు. కాలేజీలు వద్ద స్కూళ్ళ వద్ద ఇతర ముఖ్య కూడళ్లలో బాలికలు, అమ్మాయిలు,మహిళలను పోకిరీలు అసభ్య పదజాలంతో ఆటపట్టించడం, అపహాసించిడం, ఏడిపించడం వంటివి గమనిస్తే చుట్టుపక్కల ఉన్న వారు సంఘటితమై, సామాజిక బాధ్యతతో వేధింపులకు పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు.
వారి సమాచారాన్ని సకాలంలో పోలీసు వారికి అందించి, పోలీసుల సహాయం తీసుకోవాలన్నారు. ప్రభుత్వం వారు మహిళల పై జరిగే నేరాలపై తీవ్రమైన చట్టాలు చేసినందున దానిలో భాగంగా “దిశ” ఎస్.ఓ.ఎస్ యాప్ ను ప్రతి మహిళ డౌన్ లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో పోలీసు మీ వెంట ఉన్నట్టే భావించి సహాయం పొందాలన్నారు.