విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు రిషికేశ్ లో చేపట్టిన చాతుర్మాస్య దీక్ష ముగిసింది. బుధవారం ఉదయం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర గంగానదిలో స్నానమాచరించి దీక్షను ముగించారు. అనంతరం భగవద్గీతను పఠించి రిషికేశ్ లోనే వీరభద్ర మందిరాన్ని సందర్శించారు.
ఆ తర్వాత సీమోల్లంఘన సాంప్రదాయాన్ని పాటిస్తూ గ్రామ పొలిమేరలు దాటేందుకు హరిద్వార్ వెళ్ళారు. జూలై 5వ తేదీన వ్యాసపూజతో ప్రారంభమైన చాతుర్మాస్యం రెండునెలల పాటు తపోదీక్షతో సాగింది. దీక్షా కాలంలో పీఠానికి పరంపరానుగతంగా వచ్చిన గురువులను స్వామీజీలు నిరంతరం స్మరించుకున్నారు.
వేదాంత పరమైన అంశాలపై చర్చించారు. నిత్యం వేద విద్యార్థులకు శాస్త్ర సంబంధిత అంశాలపై పీఠాధిపతులు స్వరూపానందేంద్ర పాఠాలు బోధించారు. ఆదిశంకరుని శంకరభాష్యాన్ని, ప్రస్థానత్రయ భాష్యాన్ని పఠిస్తూ పరమ పవిత్రంగా దీక్షను కొనసాగించారు.
రిషికేశ్ లోని విశాఖ శారదాపీఠం ఆశ్రమంలో ఈ దీక్షను నిర్వహించారు. పీఠాధిపతులు తమ స్వహస్తాలతో గంగానదికి నిత్యం హారతులిచ్చారు. అలాగే పీఠం అనుష్టాన దైవం రాజశ్యామలా స్వరూప శారదా చంద్రమౌళీశ్వరులను పీఠార్చన ద్వారా నిత్యం ఆరాధించారు.
దీక్షా కాలంలో వినాయక చవితి, కృష్ణాష్టమి వేడుకలను ఆశ్రమంలోనే సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. జగద్గురు ఆదిశంకరాచార్యల వారిని స్తుతిస్తూ వేద విద్యార్థులతో కలిసి తోటకాష్టకంను పఠించేవారు. సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి ప్రీతికరమైన అడైకృత్తిక ఉత్సవాన్ని, పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి పరమ గురువులు సచ్చిదానందేంద్ర ఆరాధనోత్సవాలను ఈ చాతుర్మాస్య దీక్షా కాలంలో ఘనంగా నిర్వహించారు.
శ్రావణ పౌర్ణమి రోజున వేద విద్యార్థులతో ఉపాకర్మ చేయించి సప్తర్షులను ధ్యానిస్తూ జపమాచరించారు. కరోనా కష్టకాలంలోనూ ఆటంకం లేకుండా తపోనిష్టతో దీక్షను ముగించారు.