కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా శనివారం తిరుమల వసంత మండపంలో విష్ణుకమలార్చన(వైకుంఠ చతుర్దశి పూజ, కమలములతో కేశవపూజ) శాస్త్రోక్తంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ కమలం శ్రీమహాలక్ష్మికి ప్రతీక అని, శ్రీవారి వక్షఃస్థలంలో అమ్మవారు కొలువై ఉంటారని తెలిపారు. అమ్మవారికి ప్రీతిపాత్రమైన కమలాలతో వెయ్యిసార్లు అర్చించడం ఈ పూజ విశిష్టత అని తెలియజేశారు. ఈ పూజలో పాల్గొన్న వారికి దీర్థాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతాయని వివరించారు.
ముందుగా కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి ప్రార్థనా సూక్తం, విష్ణుపూజా మంత్ర పఠనం చేశారు. ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి తిరువారాధన చేశారు. ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, కృష్ణశేషాచల దీక్షితులు, వైఖానస ఆగమ సలహాదారులు ఎన్ఎకె.సుందరవదనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.