విమోచన దినం నిర్వహించుకోవడం యావత్ తెలంగాణ ప్రజల హక్కు అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి అన్నారు.
భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15న తెలంగాణ ప్రాంతమంతా రజాకార్ల బానిసత్వం లోనే మగ్గిందని, దేశం మొత్తం త్రివర్ణ పథకాలు రెపరెపలాడుతూ ఉంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఆకుపచ్చ జెండా రెపరెపలాడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భాగ్యనగరంలోని కోటి ప్రాంతంలో గల బాలగంగాధర్ తిలక్ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలస్వామి మాట్లాడుతూ నేటి తెలంగాణలోని ఉమ్మడి పది జిల్లాలతో పాటు, అటు మహారాష్ట్ర ఇటు కర్ణాటక రాష్ట్రాల్లోని ఎనిమిది జిల్లాల్లో నిజాం రజాకార్ల దోపిడి పాలన సాగుతూ ఉండేది అని గుర్తు చేశారు.
1948 సెప్టెంబర్ 17వ తేదీన అప్పటి భారత ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో తెలంగాణ ప్రాంతం స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నదని గుర్తుచేశారు.
భారత సైన్యంపై తిరుగుబాటు చేసి, చివరకు చేతకాక చేతులెత్తేసి సర్దార్ ముందు నిజాం తలవంచిన రోజే తెలంగాణకు స్వాతంత్రం లభించిన దినం అన్నారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం అని చెప్పారు.
మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంటే.. తెలంగాణలో మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ తెలంగాణ అమరవీరులను అవమాన పరుస్తున్నారని విమర్శించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ స్పందించకపోయి ఉంటే నిజాం పరిపాలిస్తున్న ప్రాంతమంతా కూడా ఉస్మానీస్తానుగా ప్రత్యేక దేశం ఏర్పడి పాకిస్థాన్ చెప్పుచేతుల్లో ఉండేదని ప్రచార సహ ప్రముఖ్ చెప్పారు.
హిందువుల మాన ప్రాణాలు దోచుకున్న రజాకార్లు
నిజాం రాజ్యంలో రజాకార్ల ఆగడాలు మితిమీరి పోయి, హిందువుల మాన ప్రాణాలు దోచుకోవడమే ఎజెండాగా ముందుకు సాగారని చరిత్రను కళ్లకు కట్టారు.
హిందూ సంస్కృతీ సంప్రదాయాల పై దాడులు.. దేవాలయాల ధ్వంసం.. హిందువులంటే ద్వేషం.. తెలంగాణ సంప్రదాయ నృత్యం అయినటువంటి బతుకమ్మ ఆటలపై ఆటవిక దాడి..
మహిళలను బట్టలూడదీసి బతుకమ్మ ఆడించడం.. ఆ అవమాన భారం భరించలేక మహిళలంతా ఆత్మహత్యలకు పాల్పడటం..
హింస .. దోపిడి.. అత్యాచారాలు.. హత్యలు.. లూటీలు.. అన్నీ కూడా నిజాం ప్రభువు కాలంలో సాగిపోయిన సంఘటనలు అని చెప్పారు.
హైదరాబాదును పూర్తిగా ముస్లిం రాజ్యంగా మార్చేందుకు కుట్రలు అంతులేని గో హత్యలు ..ఇలా లెక్కకు మించి దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొని నిబ్బరంగా నిలిచిన తెలంగాణ మనది అని గర్వంగా చెప్పారు.
రక్తం చిందించి.. ప్రాణాలర్పించి నిజాం రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడిన వీరులు.. ఎందరో అమరులకు వందనం , అభివందనం తెలియజేస్తున్నాము అని బాలస్వామి పేర్కొన్నారు.