పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుతెలియని వ్యాధి ఒకటి ప్రబలుతూ జనం ప్రాణాలకు ముప్పుగా మారిన విషయం తెలిసిందే. అంతుచిక్కని ఈ వ్యాధితో ఇప్పటికే కొందరు మరణించగా, దాదాపు 500 మంది చికిత్స పొందుతున్నారు.
అనేక పరిశోధనలు, తర్జన భర్జనల తర్వాత తాగే నీటిలో లెడ్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ విధమైన రుగ్మత వ్యాపిస్తున్నదని తేల్చారు. సరిగ్గా ఇలాంటి ప్రమాదమే కాబోయే రాజధాని నగరం విశాఖ పట్నానికి ఉందని ప్రముఖ సామాజిక సేవకుడు, రిటైర్డ్ ఐ ఏ ఎస్ అధికారి ఈ ఏ ఎస్ శర్మ వెల్లడించారు.
ఏలూరులో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని సీఎంతో పాటు పలువురు ప్రభుత్వ పెద్దలకు ఈ-మెయిల్లో ఆయన లేఖలు పంపారు. విశాఖకు ఏలూరు తరహా ముప్పు పొంచి ఉందన్నారు శర్మ అన్నారు. విశాఖ నగరంలో నీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు లేఖ రాశారు.
విశాఖ నగరంతో పాటు పట్టణాల్లో మంచినీటి కాలుష్య సమస్య తీవ్రంగా ఉందని.. మంచినీటి వనరులు, పైపులైను వ్యవస్థలు, పైపులైన్లకు వినియోగించే పైపుల నాణ్యత అంశాలన్నీ నీటి కాలుష్యానికి కారణమవుతున్నాయని లేఖలో ప్రస్తావించారు.
(శర్మ గతంలో మూడు రాజధానులకు తన పూర్తి మద్దతు తెలిపారు. అధికార వికేంద్రీకరణకు మూడు రాజధానులే మార్గమని ఆయన అప్పటిలో స్పష్టం చేశారు.)