నిద్రమత్తులో ఉండి విష వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు. విశాఖ నగరంలోని గోపాలపట్నం, ఆర్.ఆర్.వెంకటాపురంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమలో చోటు చేసుకున్న భారీ ప్రమాదంలో ఈ కారణంగానే ఎక్కువ మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు.
పరిశ్రమ నుంచి వెలువడిన రసాయన వాయువు ప్రభావం అత్యంత తీవ్రంగా మూడు కిలోమీటర్ల వరకూ వ్యాపించింది. దీంతో చర్మంపై దద్దుర్లు, కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అపస్మారక స్థితిలో రహదారిపై పడిపోయిన కొందరిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ప్రజలు భయాందోళనలతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు. సైరన్లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల ప్రజలను ఇళ్ల నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
25 అంబులెన్స్లు, పోలీసు వాహనాల ద్వారా అస్వస్థతకు గురైన వారిని విశాఖ కేజీహెచ్కు తరలిస్తున్నారు. సింహాచలం డిపోనుంచి ఆర్టీసీ బస్సులను తీసుకొచ్చి పరిశ్రమకు ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న వారిని తరలిస్తున్నారు. జిల్లా కలెక్టర్ వినయ్చంద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఆర్.కె.మీనా, ఎమ్మెల్యే గణబాబు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.