గతంలో ‘‘పగ సాధిస్తా’’ అని ఒక సినిమా విడుదలైంది….. ఇప్పుడు కనిపిస్తున్నది….. రేణిగుంట ఎయిర్ పోర్టులో నేడు జరిగిన సంఘటన చూస్తే ఆ సినిమా టైటిల్ గుర్తుకు వచ్చింది. 2017 జనవరి 26న ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా కోసం విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన క్యాండిల్ ర్యాలీకి హాజరయ్యేందుకు బయలుదేరారు. జగన్ పర్యటనకు అనుమతి లేదంటూ..ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అంబటి రాంబాబులు ఉన్నారు. పోలీసుల చర్యను జగన్ తప్పుబట్టారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ..నేలపై బైఠాయించారు. ఎయిర్ పోర్టు లాంజ్ లోనికి కూడా అనుమతించలేదు. దీనిపై వైకాపా శ్రేణులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు.
నాలుగేళ్ళ అనంతరం సేమ్ సీన్ రిపీట్
2021 సంవత్సరం, మార్చి 01వ తేదీ సోమవారం తిరుపతి రేణిగుంట ఎయిర్ పోర్టుకు తేదేపా అధినేత చంద్రబాబు వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు పాల్పడుతోందంటూ చిత్తూరులో నిరసన తెలియచేసేందుకు బాబు సిద్ధం అయ్యారు. ఈ నేపథ్యంలో..రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న చంద్రబాబును పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. పర్యటనకు అనుమతి లేదంటూ..వీఐపీ లాంజ్ లో నిర్భందించారు. పోలీసుల చర్యను చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. శాంతియుతంగా నిరసన తెలియచేసే హక్కు తనకు లేదా ? నోటీసులు ఇవ్వడం ఏంటీ ? మండిపడ్డారు. కోవిడ్, మరోవైపు ఎన్నికల ప్రవర్తనా నియమావళి నేపథ్యంలో.. టీడీపీ అధినేత టూర్కు నో చెప్పారు. దీంతో నేలపైనే కూర్చొని బాబు నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు పోలీసు అధికారులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా..బాబు వినిపించుకోలేదు. ఇలాంటి సంఘటనలు కావాలని చేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇది మందిదా? మనల్ని ప్రజలు ఎన్నుకున్నది ఎందుకు? ఇలా పగ సాధించడానికా? ఆలోచించుకోవాలి. చంద్రబాబునాయుడిని బయటకు పంపించి ఉంటే ఏమయ్యేది? కొంపలు అంటుకుపోయేవా? వెళ్లి అక్కడ నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోయేవారు… అంతే కదా? దానికి ఇంత గొడవ అవసరమా? ఆయనను బయటకు పంపిస్తే వచ్చే ప్రచారం కన్నా ఆపడం వల్ల ఎక్కువ రాలేదా? నేడు జరిగిన సంఘటనతో చంద్రబాబునాయుడిపై సానుభూతి పెరిగింది. జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువ అయింది. అధికార పార్టీ గమనించుకుని ఇక నుంచి అయినా ప్రవర్తిస్తే మంచిది.