సాంకేతిక ప్రక్రియలు పూర్తయిన వెంటనే ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇలవేల్పు శ్రీశ్రీ శ్రీ పైడితల్లి ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. మార్చి నెల ప్రారంభం నాటికి సమీపంలోని దుకాణాలను ప్రత్యామ్నాయ ప్రాంతానికి తరలించి సంబంధిత అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయనున్నట్లు వెల్లడించారు. ఆలయాన్ని విస్తరించి భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాలను, ఇతర వసతులనూ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు.. ఆరాధ్య దైవం అయిన పైడితల్లి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని స్వామి పేర్కొన్నారు. ఇప్పటికే ఫలు దఫాలు కమిటీ సభ్యులు సమావేశమయ్యారని, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారని వెల్లడించారు. దేవాదాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులతో కూడా మాట్లాడామని.. ఈ మేరకు ఆలయ సమీపంలోని దుకాణాలు, గృహ యజమానులకు ఆర్థిక పరిహారం అందజేసేందుకు, వారి దుకాణాలను ప్రత్యామ్నాయ చోటుకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
ఆలయాన్ని విస్తరించటం ద్వారా భవిష్యత్తులో భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని, సులభంగా దర్శన భాగ్యం లభిస్తుందన్నారు. అభివృద్ధి చర్యల్లో భాగంగా మార్చి ఒకటో తేదీ నాటికి సమీపంలోని యజమానులు వారి భవనాలను అప్పగించినున్నారని తెలిపారు. అనంతరం సంబంధిత అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంపూర్ణ సహకారం అందించారని, ఆలయ కమిటీ సభ్యుల ప్రత్యేక చొరవ తీసుకున్నారని ఎమ్మెల్యే స్వామి గుర్తు చేశారు.
యజమానులకు చెక్కుల అందజేత
ఆలయ అభివృద్ధికి స్థలాలు ఇచ్చిన దుకాణాలు, గృహ యజమానులకు డిప్యూటీ స్పీకర్ చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేశారు. ఆలయ ప్రాంగణంలో యజమానులు వెంకటేశ్వర రావుకు 11 లక్షలు, కృష్ణప్రియకు 4.35 లక్షల విలువ గల చెక్కులను స్వామి అందజేశారు.ఈ సమావేశంలో దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కిషోర్ కుమార్, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, దేవస్థానం పాలక మండలి సభ్యులు, స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.