విజయనగరం జిల్లాలో ఐదు పగటిపూట దొంగతనాలకు పాల్పడిన నిందితుడ్ని అరెస్టు చేసి, అతని వద్ద నుండి 9 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లుగా విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో విజయనగరం ఇన్ చార్జ్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, చీపురుపల్లి ఇన్చార్జ్ డిఎస్పీ బి. మోహనరావు వెల్లడించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం పత్తికాయపాలవలస కి చెందిన 28 ఏళ్ల వున్నాన రాంబాబు ఆన్లైను బెట్టింగులు, చెడు వ్యసనాలకు అలవాటు పడి, తన అవసరాలకు తీర్చుకొనేందుకు డబ్బులకు ఆశపడి గ్రామాల్లోను, పట్టణాల్లో పగటిపూట రెక్కీ నిర్వహించి, తాళాలు వేసి వున్న ఇండ్లను లక్ష్యంగా చేసుకొని, నేరాలకు పాల్పడేవాడు. నిందితుడు ఎస్.కోట, విజయనగరం వన్ టౌన్, జామి, రాజాం పోలీసు స్టేషను పరిధిలో 5 దొంగతనాలకు పాల్పడినట్లుగా నేర స్థలాల వద్ద లభించిన సాంకేతిక ఆధారాలు వలన పోలీసులు గుర్తించారు.
నిందితుడ్ని అరెస్టు చేయాలని నిర్ణయించిన ఎస్.కోట పోలీసులు, చీపురుపల్లి పోలీసుల సహాయం కోరారు. జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో ఎస్ఐలు సన్యాసి నాయుడు, లోవరాజు, కానిస్టేబుళ్ళు ఎం. భానోజీరావు, సిహెచ్. జగదీష్ మరియు సిబ్బంది నిందితుడ్ని పత్తికాయపాలవలస గ్రామ జంక్షన్ వద్ద అరెస్టు చేసి, నిందితుడి వద్ద నుండి 9 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు మరో 3 తులాల బంగారు ఆభరణాలను తన అవసరాలకు వేరే చోట కుదువ పెట్టినట్లుగా గుర్తించారు. వీటిని కూడా పోలీసులు రికవరీ చేసి, బాధితులకు 12 తులాల ఆభరణాలను బాధితులకు అప్పగిస్తామని డిఎస్పీలు ఆర్.శ్రీనివాసరావు, బి.మోహనరావులు తెలిపారు.
ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసి, నిందితుడ్ని అరెస్టు చేసి, దొంగిలించిన సొత్తును రికవరీ చేయుటలో ప్రతిభ కనబర్చిన ఎస్ఐలు సన్యాసి నాయుడు, జి. లోవరాజు, కానిస్టేబుళ్ళు సిహెచ్. వైకుంఠరావు, వి. సూర్యనారాయణ, పి.శ్రీనివాసరావు, వి. వెంకట రమణలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించినట్లు, వీరికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేస్తామని డిఎస్పీలు ఆర్.శ్రీనివాసరావు, బి.మోహనరావు తెలిపారు.