ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని దీని ద్వారా మనకు నచ్చిన వారిని నాయకులుగా ఎన్నుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం దేశ ప్రజలందరికీ కల్పించిందని నల్లగొండ అదనపు ఎస్పీ నర్మద అన్నారు.
సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ఆమె జిల్లా పోలీసు కార్యాలయంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో 18 సంవర్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని, ప్రతి ఎన్నికలలో తన ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని సూచించారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయవచ్చని ఆమె చెప్పారు.
ప్రపంచ దేశాలలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన భారతదేశంలో ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి పైనా ఉన్నదన్నారు. ప్రజలను చైతన్యం చేయడం, వారికి ఓటు విలువ గురించి అవగాహన కల్పించడం ద్వారా ప్రజలంతా ఓటర్లుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని ఆమె చెప్పారు.
కార్యక్రమంలో డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, బి. దయాకర్ రావు, ఏ.ఆర్. డిఎస్పీ సురేష్ కుమార్, ఎస్.బి. డిఎస్పీ రమణా రెడ్డి, సిఐ రవీందర్, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, కృష్ణారావు, నర్సింహా, డిపిఓ సిబ్బంది రాజు, ఖలీల్, లియాఖత్ తదితరులు పాల్గొన్నారు.