ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈనెల 25వ తేదీ రాష్ట్ర సచివాలయానికి సెలవు దినమైనందున ఒకరోజు ముందుగానే ఈ15వ జాతీయ ఓటర్ల దినోత్సవ ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని శుక్రవారం రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు వద్ద సచివాలయ ఉద్యోగులతో సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్)ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు.
ఈసందర్భంగా ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి మూలస్థంభం ఓటని భారత దేశ పౌరులుగా, ఓటరుగా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు. గత ఎన్నికల్లో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 80 శాతానికి పైగా ఓటింగ్ శాతం నమోదై రికార్డు సృష్టించడం జరిగిందని గుర్తు మీనా ఈ సందర్భంగా గుర్తు చేశారు. దేశ ఓటింగ్ వ్యవస్థ అంతటినీ ప్రజాస్వామ్య బద్ధంగా భారత ఎన్నికల సంఘం నిర్వహింస్తుందని ఆ ప్రక్రియలో భాగంగానే ఓటర్లందరిలో ఓటు హక్కు వినియోగంపై అవగాహనను పెంపొందించే లక్ష్యంతో ప్రతి ఏటా జనవరి 25వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు.
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించు కున్న సీనియర్ ఓటర్లను సత్కరించు కోవడం జరుగుతుందని తెలిపారు. అంతేగాక ఓటు హక్కు వినియోగ ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం తీసుకవచ్చే వారిని కూడా ప్రత్యేకంగా సత్కరించడం వంటి చర్యలు తీసుకుంటారని ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. అంతకు ముందు ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా కార్యక్రమంలో పాల్గొన్న అందరితో భారత దేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో,మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్ష్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని, మతం,జాతి,కులం,వర్గం,భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ణ చేస్తున్నామని ప్రతిజ్ణ చేయించారు. ఈ జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ఞ కార్యక్రమంలో సచివాలయ సాధారణ పరిపాలన శాఖ డిఎస్(జనరల్)కాళీ కుమార్,సచివాలయ ముఖ్య భద్రతాధికారి మల్లిఖార్జున, సచివాలయ సాధారణ పరిపాలన శాఖకు చెందిన పలువురు అధికారులు,ఉద్యోగులు,ఇతర విభాగాల అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.