ఓటరు జాబితాలో తప్పులు లేకుండా ఉండేందుకు వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లకు స్పెషల్ సమ్మరి రివిజన్, స్వీప్ యాక్టివిటీల పై పలు సూచనలు చేశారు.
ప్రతినెల వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి.ఎల్.ఓ ల ద్వారా పరిశీలన జరిపి పరిష్కరించి ఆన్లైన్ లో నమోదు చేయాలని సూచించారు. ఓటరు జాబితాలో కొత్తగా నమోదు కై వచ్చిన దర్సఖాస్తులు , పేరు మార్పు చేర్పులు, పోలింగ్ స్టేషన్ మార్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తెలియజేసారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదు చేసుకునేవిధంగా స్వీప్ యాక్టివిటీలు నిర్వహించాలని తెలియజేసారు.
పేపరు పని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ఎన్నికల కమిషన్ గరుడ మొబాయిల్ యాప్ ను ప్రవేశ పెట్టిందని వీటిపై బూత్ లెవల్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చి ప్రతి పోలింగ్ స్టేషన్ వివరాలు గారుడా యాప్ లో నమోదు చేసేవిధంగా చూడాలన్నారు. వచ్చిన దరఖాస్తులను వెనువెంటనే గారుడా యాప్ లో నమోదు చేసేవిధంగా బి.ఎల్.ఓ లకు నిర్దేశించాలన్నారు. హెల్ప్ లైన్ యాప్ ను ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా విస్తృత ప్రచారం కల్పించాలని తెలియజేసారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న నాగర్ కర్నూల్ జిల్లా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ స్వీప్ యాక్టివిటి, హెల్ప్ లైన్ యాప్ ప్రచారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కారించేందుకు చర్యకు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఎన్నికల సిబ్బంది తదితరులు వి.సి. లో పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్