పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలంలో నేడు చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రంలోని రెవెన్యూ వ్యవస్థలో లంచాలు ఏ స్థాయిలో ఉన్నాయో కళ్లకు కడుతున్నది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలం లోని రామసింగవరం, పెదవేగి, దుగ్గిరాల గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న నలుగురు వి ఆర్ ఓ లను పెదవేగి తహసీల్దార్ సుందర్ సింగ్ అకస్మాత్తుగా బదిలీ చేశారు.
పెదవేగి తహసీల్దార్ కార్యాలయానికి వీరిని సరెండర్ చేశారని తెలిసింది. ఈ నలుగురు వి ఆర్ ఓ ల ను ఎందుకు సరెండర్ చేశారనే అంశం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నది. ఆయా గ్రామాల రైతుల భూములను మ్యుటేషన్ లు చేయిస్తామని పలువురు రైతులనుండి లక్షలాది రూపాయలు ముడుపులు వసూలు చేసినట్టు తెలిసింది.
ఈ కారణంతోనే ఆ నలుగురు వి ఆర్ ఓ లను ఆ గ్రామాలవిధుల నుంచి తప్పించి తహసీల్దార్ కార్యాలయానికి సరెండర్ చేశారని సమాచారం. తహసీల్దార్ కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున మ్యుటేషన్ లు జరుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ కార్యాలయ అధికారులను పై అధికారులు ఏ కార్యాలయానికి సరెండర్ చేస్తారని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ మ్యుటేషన్ ల పై వచ్చే ముడుపులు తహసీల్దార్ కార్యాలయ అధికారులకు ముట్టడం లేదనే వ్యవహారం లోనే కార్యాలయంలో అధికారులకు .వి ఆర్ ఓ ల కు తహసీల్దార్ జాయిన్ అయిన దగ్గర నుండి కోల్డ్ వార్ జరుగుతున్నట్టు సమాచారం. వి ఆర్ ఓ లకు కు తెలియకుండా తహసీల్దార్ గుట్టుగా ఒకరిద్దరు మధ్యవర్తులను పెట్టుకుని మొత్తం మ్యుటేషన్ లు చాటు మాటుగా చేస్తూ రైతుల దగ్గర నుండి వసూలు చేసే ముడుపులన్ని తహసీల్దార్ నొక్కేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా చెప్పుకుంటున్నట్టు తెలిసింది.
అదే రీతి లో కార్యాలయంలో మరో అధికారి కూడా వి ఆర్ ఓ లను పక్కన పెట్టి తనకున్న అధికార రాజకీయ పలుకుబడి తో మ్యుటేషన్ వ్యవహారాలలో తన చేతివాటం చూపిస్తున్నట్టు సమాచారం. దీనిపై తహసీల్దార్ సుందర్ సింగ్ ని పోన్ ద్వారా వివరణ కోరగా మండలం లో మ్యుటేషన్ లపై కొంత మంది వి ఆర్ ఓ లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని తహసీల్దార్ చెప్పారు.
ఏ సి బి అధికారులు కూడా తనకు పోన్ చేసి తహసీల్దార్ కార్యాలయంలో మ్యుటేషన్ లకు సంబంధించి రైతులనుండి ముడుపులు గుంజుతున్నారని ఆరోపణలున్నాయని ఆడిగినట్టు తహసీల్దార్ సుందర్ సింగ్ తెలిపారు. రైతులు నేరుగా తనను కలిసి వాళ్ళ భూ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. గ్రామాలలో వి ఆర్ ఓ లద్వారా ఇబ్బందులు పడుతున్న రైతులు నేరుగా తహసీల్దార్ ని కలిసి ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్నారని తహసీల్దార్ అన్నారు.
పెదవేగి మండలం నుండి సాధ్యమైనంత త్వరగా బదిలీపై వెళ్లాలనుకుంటున్నట్టు చెప్పారు. తాను మ్యుటేషన్ ల వ్యవహారం లో మధ్యవర్తుల ను ఉపయోగించడం లేదని, రైతుల దగ్గర మ్యుటేషన్ లకు సంబంధించి ముడుపులు తీసుకుంటున్నట్టు వచ్చే ఆరోపణల్లో వాస్తవం లేదని తహసీల్దార్ సుందర్ సింగ్ తేల్చి చెప్పారు. మండల మంతా గజిబిజిగా ఉందని ఇక్కడ పనిచేయ లేక పోతున్నానని అన్నారు.
గతం లో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ కూడా మ్యుటేషన్ ల పేరుతో లక్షలాది రూపాయలు ముడుపులుగాను, విలువైన వస్తువులు గిఫ్ట్ లు గాను పొందారని కొంత మంది రెవిన్యూ సిబ్బందే అప్పట్లో చెప్పుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.