తెలంగాణ ఆర్టీసీలో దరఖాస్తు చేసిన ఉద్యోగులందర్నీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎ్స)కు అనుమతించనున్నారు. వీఆర్ఎస్ ను ఇక నుంచి నిరంతరప్రక్రియగా పరిగణించాలని నిర్ణయించారు. ప్రత్యేక ప్యాకేజీ లేకపోవడంతో ఇప్పటి వరకు అమలులో ఉన్న నిబంధనల మేరకే వీఆర్ఎ్సపై వెళ్లే వారికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించనున్నట్టు యాజమాన్యం స్పష్టం చేసింది. ఆర్టీసీలో సంస్కరణల్లో భాగంగా వయోభారం, అనారోగ్యంతో విధులు నిర్వహించలేకపోతున్న డ్రైవర్లు, కండక్టర్లను సాగనంపడం ద్వారా వేతనాల భారం తగ్గుతుందని అధికారులు భావించారు.
అయితే ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇచ్చినట్టుగా వీఆర్ఎస్ ప్యాకేజీ ఇస్తే ఆర్టీసీలో ప్రస్తుత పనిభారం తట్టుకోలేక పది వేల మంది వరకు వీఆర్ఎ్సకు సిద్ధంగా ఉన్నారని ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. 55 ఏళ్లు పైబడిన ఉద్యోగులు రోజూ ఏకధాటిగా పది గంటల పాటు సిటీ బస్సులు నడుపలేక నరకయాతన అనుభవిస్తున్నారని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వీఆర్ఎస్ దరఖాస్తులను స్వీకరించి అర్హులందరికీ అవకాశం కల్పించాలని ఆర్టీసీ యాజమాన్యం డిపో మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పీఆర్సీలు, 5 డీఎల బకాయిలు రావలసి ఉందని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో యజమాన్యం స్పష్టత ఇచ్చే వరకు వీఆర్ఎస్ కోసం దరఖాస్తులు చేయవద్దని, చేస్తే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారని వారు చెబుతున్నారు.