వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే కొవిడ్-కరోన అనుమానితులు, బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావు అదేశాల మేరకు వనపర్తి జిల్లా ఆసుపత్రి ఆవరణలో ‘కొవిడ్-19 హెల్ప్ డెస్క్’ను వనపర్తి పోలీస్ సి.ఐ. ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. ఈ హెల్ప్ డెస్క్లో పోలీస్ కానిస్టేబుళ్లు, మెడికల్ సిబ్బంది విధుల్లో ఉంటారని సి.ఐ.తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి తగిన మార్గదర్శనం చేస్తారని వివరించారు.
కరోనా వైరస్ అతివేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్న కొవిడ్ రోగుల క్షేమ సమాచారం వారి ఆరోగ్య పరిస్థితిని వారి కుటుంబీకులకు తెలపడానికి ఈ హెల్ప్ డెస్క్ ఉపయోగ పడుతుందన్నారు.
ఇప్పటికే జిల్లాలో కరోనా వైరస్ కట్టడి కోసం అలుపెరుగక పోరాటం చేస్తున్న పోలీసు సిబ్బంది కరోనా బారిన పడితే తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. టెలి కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ అపూర్వరావు స్వయంగా సిబ్బంది ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం, ఇంకా మెరుగైన వైద్యం అవసరమనుకుంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులలో ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించి కొవిడ్ వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వనపర్తి టౌన్ ఎస్.ఐ. మధుసూదన్, డాక్టర్ చైతన్య గౌడ్, పోలీస్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి