నూతన సంవత్సరంలో సరికొత్త ఆలోచనలతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని వనపర్తి జిల్లా ఎస్ పి కె.అపూర్వరావు తెలిపారు.
నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లా ఎస్పీ జిల్లాలోని పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి జిల్లా పోలీసు శాఖ తరపున ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్లిష్టమైన సంవత్సరం దాటుకుని నూతన సంవత్సరంలోకి ప్రవేశించామని నూతన సంవత్సరంలో జిల్లాలోని పోలీసులు, ప్రజలంతా ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆకాంక్షించారు. కరోనా వైరస్ ఇంకా పూర్తిగా పోలేదని, దానికి తోడు కొత్త వైరస్ లు వస్తున్నాయని ఇలాంటి క్రమంలో అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు.
కరోనా కష్టకాలంలో, లాక్ డౌన్ సమయంలో తమకు కరోనా సోకినా ప్రజల క్షేమం ముఖ్యమని భావించి పోలీసు అధికారులు, సిబ్బంది చేసిన కృషి, సేవలను ఎస్పీ అభినందించారు. పరస్పర సమన్వయంతో, కలిసి పని చేయడం ద్వారా పోలీసుశాఖలో అన్ని స్థాయిల అధికారులు కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో కీలకంగా పని చేశారని గుర్తు చేశారు.
ఈ నూతన సంవత్సరంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను మెప్పించేలా, వారి అభిమానం, మన్ననలు పొందే విధంగా విధి నిర్వహణ చేయాలని సూచించారు. ప్రజల దృష్టిలో పోలీసులంటే న్యాయం చేసే వారిని, పోలీస్టేషన్ కు వెళితే న్యాయం లభిస్తుందనే నమ్మకాన్ని ప్రజలలో కల్పించడం లక్ష్యంగా పని చేయాలన్నారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ వారి హక్కులను కాపాడుతూ చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. అదే సమయంలో చట్టాలను గౌరవించే ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ పోలీసుశాఖ గౌరవాన్ని పెంచేలా పని చేయాలన్నారు.
ఈ నూతన సంవత్సరంలో నేరరహిత,ప్రమాదాల నివారణ,మహిళల భద్రత, పీపుల్ ప్రెండ్లీ అమలే లక్ష్యంగా సేవాలందిస్తున్నట్లు తెలిపారు.
ఈ నూతన సంవత్సర వేడుకలలో జిల్లా అదనపు ఎస్పీ షాకీర్ హుస్సేన్, వనపర్తి డీఎస్పీ కెఎం కిరణ్ కుమార్, వనపర్తి సిఐ సూర్య నాయక్, కొత్తకోట సీఐ మల్లికార్జున్ రెడ్డి, ఆత్మకూరు సిఐ సీతయ్య, డిసిఆర్బీ సిఐ జమ్ములప్ప, సిసిఎస్ సిఐ శ్రీనివాస్ జిల్లాలోని ఎస్సైలు పోలీసు సిబ్బంది కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి