కోవిడ్ వ్యాక్సినేషన్ ను సక్రమంగా నిర్వహించేందుకు వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకుగాను జిల్లాలోని 16 కేంద్రాల్లో డ్రై రన్ (మాదిరి ) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు.
శుక్రవారం ఆమె వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్వహించిన డ్రై రన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులలో డ్రై రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి కేంద్రంలో పూర్తి వివరాలతో పాటు ,అన్ని ఏర్పాట్లు, డ్రై రన్ చేసే వారి పేర్లు ఆన్లైన్ ద్వారా నమోదు చేసినట్లు తెలిపారు.
రానున్న కాలంలో వ్యాక్సిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు పాటిస్తూ సక్రమంగా వ్యాక్సినేషన్ వేసేలా డ్రై రన్ నిర్వహిస్తున్నామని, హెల్త్ వర్కర్లు, అంగన్వాడి ఆశావర్కర్లు గట్టి నమ్మకం కలిగించేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నారు.
ఇందులో భాగంగా 25 మంది పేర్లను నమోదు చేయడం జరిగిందని ఆమె వెల్లడించారు. ఈ ప్రక్రియ మొత్తం కోవిన్ సాఫ్ట్వేర్ లోరూపొందించడం జరిగిందని, వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఎంత మంది నమోదు చేసుకున్నారో వారికి ఎప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలనే విషయం సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ పంపడం జరుగుతుందని ఆమె వెల్లడించారు.
నమోదైన వారి పేర్ల ప్రకారం వారికి రిజిస్ట్రేషన్,వేచిఉండు గది, వ్యాక్సిన్ రూమ్,వ్యాక్సిన్ వేసిన తర్వాత పరిశీలించేందుకు అబ్జర్వేషన్ రూమ్ వంటివి ఏర్పాటు చేశామని, వ్యాక్సిన్ వేసిన తర్వాత ఎవరికైనా తల తిరగడం, వాంతులు వంటివి సంభవిస్తే తక్షణమే వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందించడం జరుగుతుందని, వీరు అందరూ అందుబాటులో ఉంటారని కలెక్టర్ వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఏ. శ్రీనివాసులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్ సాగర్,ఆర్ ఎం ఓ చైతన్య గౌడ్ ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ సీనియర్ విలేకరి