ప్రభుత్వం సౌకర్యాలు కల్పించకపోవడంతో రోగుల నుంచి తీవ్ర వత్తిడి ఎదుర్కొంటున్న వైద్యులు విధి నిర్వహణ నుంచి వైదొలగుతున్నారు. తమను తాము రక్షించుకోలేక, తమతో పని చేసేవారిని కాపాడుకోలేక, రోగులకు సౌకర్యాలు కల్పించలేక తీవ్ర మానసిక వేదనకు గురి అవుతున్నారు.
ప్రభుత్వం వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. కోవిడ్ ఆసుపత్రి అయిన ఎంజిఎంలో సౌకర్యాలు కల్పించకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దాంతో ఎదురుగా కనిపించే డాక్టర్లపై తమ ప్రతాపం చూపిస్తున్నారు. ఒక ఎమ్మెల్యే పిఏ ఇటీవలె ఒక వైద్యురాలిపై దాడి చేసిన విషయం తెలిసిందే.
ఇలాంటి నేపథ్యంలో పని చేయలేక వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజీనామా సమర్పించారు. సూపరింటెండెంట్ శ్రీనివాసరావు ఆరోగ్యం సహకరించడం లేదంటూ డీఎంఈకి లేఖ రాసి విధుల నుంచి తప్పుకున్నారు.
అదే విధంగా శ్రీనివాసరావు పై నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలను కూడా ఉన్నాయి. ఈ విషయంలో గతంలో వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును తప్పుదోవ పట్టించబోయాడని విమర్శలు వెల్లువెత్తాయి.
పైగా ఇతను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి కొండా సురేఖ-మురళీధర్ రావుల వర్గానికి చెందిన మనిషిగా ముద్ర వుంది. రాజకీయ ఒత్తిళ్ళల్లో టీఆర్ఎస్ కు చెందిన వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ , మంత్రి దయాకర్ రావు హస్తం వున్నట్లు సమాచారం.