రోడ్డు ప్రమాదాలను నివారించడానికి వాహనదారులు భద్రతా నిబంధనల్ని ఆచరించడంతో పాటు వాహనాలను నడిపేటప్పుడు కొన్ని జాగ్రత్తల్ని తప్పని సరిగా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రవాణా శాఖా ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2 వరకు నిర్వహించే రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా హెల్మెట్ ధరించిన మంత్రి మోటార్ సైకిల్ ను నడిపారు.
సోమవారం హెచ్.ఎం.డి.ఎ. మైదానంలో జరిగిన ఈ వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో రవాణా శాఖా అధికారులతో పాటు అరవింద సమేత ఫేమ్ నటి ఈషా రెబ్బ, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ వాహనాలు, జనాభా సంఖ్య పెరగడంతో పాటు భద్రతా నిబంధనల్ని పాటించడకపోవడంతోనే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వాహనాలు నడుపుతున్న సమయంలో కొన్ని జాగ్రత్తల్ని పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని, ఈ చిన్నపాటి జాగ్రత్తల్ని తీసుకోకపోవడం వల్లే అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ద్విచక్ర వాహన నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెంట్ను ధరించాలని కారు, తదితర వాహనాలను నడిపేటప్పుడు సీట్ బెల్టులు పెట్టుకొవడం మరిచిపోకూడదన్నారు.
మద్యం సేవించి వాహనాలు నడిపితే నడిపే వారితో పాటు ఎదుటివారికి సైతం ప్రమాదాలు సంభవిస్తాయని, ట్రాఫ్డిక్ రూల్స్ ను పాటిస్తూ ప్రయాణాల్లో అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు అవగాహన, ఛైతన్య కార్యక్రమాలలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ డ్రైవింగ్ స్కూల్ మ్యానువల్ బుక్ను ఆవిష్కరించి రోడ్డు భద్రతా సమాజిక బాధ్యతగా గుర్తెరుగాలని చెప్పారు. రోడ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ యువకులు తమ విలువైన జీవితాన్ని కాపాడుకోవాలని, యాక్సిడెంట్కు గురైన తరువాత గంటలో చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. సినీ నటి రెబ్బా మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా రోడ్ సేఫ్టీ అవగాహనను ఉపయోగించుకోవడం, యువతపై దాని ప్రభావంకు సంబంధించిన అంశాలపై వివరించారు. మోటారు సైకిల్ తయారీదారులైన బిఎమ్డబ్ల్యూ, రాయల్ ఎన్ఫీల్డ్, ట్రయంఫ్ మోటార్ సైకిల్ యజమానులతో పాటు కళాశాల విద్యార్థులు / మోటారు డ్రైవింగ్ పాఠశాలల, ఎన్సిసి కేడర్ విద్యార్థులు పాల్గొన్నారు.