అసలే వేసవికాలంలో త్రాగు నీటి సమస్య. నీటి సమస్యతో ప్రజలే ఇబ్బందులకు గురవుతారు. వారికి స్థానిక ప్రజాప్రతినిధులు ఎలాగైనా నీటి వసతి కల్పిస్తున్నారు. ప్రజలకు నోరు వుంది కాబట్టి సమస్య చెప్పుకోగలుగుతారు. సమస్య పరిష్కరించుకోగలరు. మరి నోరు లేని జీవాల సంగతి ఏంటి?
రోడ్ల వెంట తిరిగే మూగ జీవాలను ఎవరు పోషిస్తారు? అసలే కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఎవరూ బయటికి రావడంలేదు. ఆ మూగ జీవాలకు కనీసం దప్పిక తీర్చేవారు కరువయ్యారు. కరోనా వ్యాధి వ్యాపిస్తున్న సమయంలో ప్రజల కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోలీస్ లు పోరాటం చేస్తున్నారు.
పోలీస్ అధికారులు ప్రజలనే కాదు. మూగజీవాలను కూడా రక్షిస్తున్నారు. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో స్థానిక సర్కిల్ ఇన్ స్పెక్టర్ బి.వెంకట్ రెడ్డి మూగజీవాలకు నీటి తొట్టిని ఏర్పాటు చేయించి దప్పిక తీరుస్తున్నారు. ఆవులు, మేకలు ప్రతి రోజు ఆ నీళ్ల తొట్టిలోని నీటితో దప్పికను తీర్చుకుంటున్నాయి.
ఇదంతా పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా మెయిన్ రోడ్ పై లక్ష్మి ఫోటో స్టూడియో దగ్గర ఏర్పాటు చేశారు. కొందరు షాపుల ఓనర్స్, స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా సిఐ బి.వెంకట్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ప్రతిరోజు ఆ నీటి తొట్టి పరిశీలిస్తున్నారు. నీటి సమస్య రాకుండా తగిన చర్యలు తీసుకున్నారు.