రైల్వే గేటును తొలగించి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టర్ను వర్షపు నీరు పోయేందుకు పైపులైన్ వేయక పోవటంతో ఆరు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు.
గుంటూరు జిల్లాలోని గుండ్లకమ్మ, కురిచేడు స్టేషన్ల మధ్య యోగిరెడ్డిపాలెం వద్ద గత సంవత్సరానికి పైగా రైల్వే అండర్ గ్రౌండ్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు ఇప్పటికీ పూర్తి స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టక పోవటంతో ప్రయాణ కష్టాలు వారికి శాపంగా మారాయి.
ముఖ్యంగా యోగిరెడ్డిపాలెం, కొత్త నాగిరెడ్డిపల్లి, పాత నాగిరెడ్డిపల్లి, లింగముక్కపల్లి, తంగిరాల తదితర గ్రామాల ప్రజలు ఇటీవల కురిసిన వర్షాలకు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వద్ద మూడు అడుగులకు పైగా నీరు నిలవటంతో రాకపోకలు సాగించ లేని పరిస్థితి నెలకుంది.
ప్రమాద కరమైన పరిస్థితుల్లో రైలు పట్టాలు దాటుతుండగా గురువారం యోగిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన నిండు గర్భిణీని వినుకొండ ఆస్పత్రికి తరలించేందుకు అవస్థలు పడాల్సి వచ్చింది. ఇప్పటికైనా సంబంధిత రైల్వే అధికారులు కాంట్రాక్టర్చే వెంటనే పైపులైన్ ఏర్పాటు చేయించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.