గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని కాజ గ్రామంలోని రజక చెరువు ప్రమాద భరితంగా మారింది. పుల్లయ్య నగర్ కు వెళ్లే రహదారి మార్గంలో చెరువు అంచుమట్టిని అడ్డగోలుగా తవ్వేయడంతో ప్రమాదం పొంచి ఉంది.
దోబీ ఘాట్ పేరుతో చెరువుకు బహిరంగ వేలం పాటలు నిర్వహించకుండా షుమారు దశాబ్ధకాలంగా పెత్తనం చెలాయిస్తోన్న కొందరు చేపల పెంపకంతో ఆదాయం పొందడంతో పాటు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ స్థానికులను సైతం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోన్నారు.
చెరువు అంచున గేదెలను కట్టివేసుకుంటున్నామనే అక్కసుతో అంచుమట్టిని తవ్వేశారని, తాము గతంలో వేసుకున్న రాళ్లను సైతం ప్రొక్లైయిన్ తో చెరువులో నెట్టి వేశారని స్థానిక మహిళ తులశమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. అదేమని అడిగితే తమపై దాడికి సైతం పాల్పడ్డారని, దీంతో చేసేది లేక మిన్న కుండిపోయామని కన్నీళ్ల పర్యంతమైంది.
ఇక చెరువు అంచున ఉన్న గడ్డిని గేదెలు మేస్తున్నాయనే సాకుతో గడ్డిమందును పిచికారి చేశారని, ఆ గడ్డిని మేసిన గేదెలు సైతం అస్వస్థతకు గురై ప్రాణాలతో భయటపడ్డాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చెరువులో చనిపోయే చేపలు కారణంగా తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని ఆమె వాపోయింది.
గతంలో నిర్వహించిన వనం-మనం కార్యక్రమంలో భాగంగా పంచాయతి వారు నాటించిన మొక్కలు సైతం గడ్డి మందు పిచికారితో పూర్తిగా ఎండిపోయి పచ్చదనం కనుమరుగైపోయిందని పలువురు గ్రామస్తులు మండిపడుతోన్నారు.
దోబీఘాట్ పేరుతో చెరువు పెత్తనం దక్కించుకోవడమే కాకుండా చేపల పెంపకంతో పంచాయతి ఆదాయానికి గండికొడుతున్న విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించడంతో పాటు పుల్లయ్య నగర్ వెళ్లే చెరువు అంచున రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడితే తమ ప్రాణాలను కాపాడినవారవుతారని పలువురు ప్రజలు అభిప్రాయ పడుతున్నారు.