హైదరాబాద్ నగరంలో జలమండలి సరఫరా చేస్తున్న నీటిలో ప్రజల ఇంటి వద్ద అధికంగా నీటి వృథా జరుగుతున్నదని, నీటి వృథాను తగ్గించేందుకు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం సనత్ నగర్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టు చేపడుతున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్ తెలిపారు. శనివారం ఖైరతాబాద్ లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో దానకిషోర్ కలిసి సనత్ నగర్ పైలెట్ ప్రాజెక్టుపై రాష్ట్ర పశుసంవర్ధక, మత్య్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ మరింత మెరుగైన మంచినీటి సరఫరా, మంచినీటి పొదుపు, వృథా నీటిని తగ్గించడం, లెక్కలోకి రాకుండా పోతున్న నీటిని తగ్గించడం కోసం మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచనలతో పైలెట్ ప్రాజెక్టును జలమండలి సనత్ నగర్ నియోజకవర్గంలో మొదలు పెడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు విజయవంతం అయ్యేందుకు స్థానిక ప్రజలు, కాలనీ సంఘాలు తోడ్పాటునందిస్తాయని వివరించారు. ఈ ప్రాజెక్టు విజయవంతమయితే ఏడాదిలో నగరవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడతామని తలసాని తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రజలకు మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా జలమండలి విశేషంగా కృషి చేస్తుందని అభినందించారు. జలమండలి ఎండీగా దానకిషోర్ బాధ్యతలు తీసుకున్న తరువాత జలమండలి మరింత మెరుగైన సేవలు అందిస్తుందని తెలిపారు. టెక్నాలజీ వినియోగించి ఇంకా సులువైన పద్దతుల్లో ప్రజలకు చెరువ కావాలని సూచించారు. కోటి మందికి పైగా ఉన్న నగర జనాభాకు అందుకు తగ్గట్టుగానే సేవలు జలమండలి అందిస్తుందని తెలిపారు. అలాగే పైలెట్ ప్రాజెక్టులో భాగంగా చేపట్టే కార్యక్రమాలను ఎండీ దానకిషోర్ మంత్రి కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. ఎం. సత్యనారాయణ, ఆపరేషన్-1 డైరెక్టర్ అజ్మీరా కృష్ణ, ప్రాజెక్టు-2 డైరెక్టర్ డి. శ్రీధర్ బాబులతో పాటు సంబంధిత సీజీఎమ్ లు, జీఎమ్ లు, పలువురు అధికారులు, స్థానిక కార్పోరేటర్లు పాల్గొన్నారు.
previous post