ఇంటర్ నెట్ వినియోగంలో పెరుగుదల సంగతి ఎలా ఉన్నా ఇంటర్ నెట్ ను నిలుపుదల చేయడంలో మాత్రం భారత్ ప్రధమ స్థానంలో నిలిచింది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానికంగా వివిధ సందర్భాలలో గత నాలుగు సంవత్సరాలలో 400 సార్లు ఇంటర్ నెట్ షట్ డౌన్ చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.
అదే విధంగా ఎక్కువ వ్యవధిలో కొన్ని రోజుల పాటు ఇంటర్ నెట్ షట్ డౌన్ చేయడంలో కూడా భారత్ ప్రధమ స్థానంలోనే ఉంది. ఇలా ప్రపంచంలో ఏ దేశంలో కూడా జరగలేదు.
2021 నూతన సంవత్సరంలో 40 రోజుల కాలంలోనే ఏడు సార్లు ఇంటర్ నెట్ షట్ డౌన్ చేశారు.
ఎక్కువ సార్లు ఇంటర్ నెట్ షడ్ డౌన్ చేసిన ప్రాంతాలుగా హర్యానాలోని జజ్జార్, సోనిపట్, పల్వాల్ జిల్లాలు ఉన్నాయి.
రైతు చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు అణచివేతలో భాగంగా కూడా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఇంటర్ నెట్ షట్ డౌన్ చేస్తున్నారు.
టెలికాం సర్వీస్ చట్టం లోని అధికరణల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇంటర్ నెట్ సేవలను నిలిపివేసేందుకు అధికారం కలిగి ఉంటాయి.
2020 జనవరిలో ఇచ్చిన ఒక తీర్పులో సుప్రీంకోర్టు ఇలా ఇంటర్ నెట్ సేవలు నిలుపుదల చేయడం శ్రేయస్కరం కాదని చెప్పింది. ఇంటర్ నెట్ సేవలు అందుకోవడం ప్రాధమిక హక్కు అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. 2020లో మొత్తం 8,927 గంటల పాటు ఇంటర్ నెట్ సేవలను షట్ డౌన్ చేశారు.