దళితులను నాలుగు గోడల మధ్య అవమానిస్తే కేసు ఉండదని సుప్రీం కోర్ట్ తీర్పు ఇవ్వడాన్ని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహయ్య తీవ్రంగా ఖండించారు. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ మాలమహానాడు డిమాండ్ చేసింది.
మేడ్చల్ మల్కాజిగిరి తెలంగాణ మాలమహానాడు జిల్లా కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నర్సింహ్మయ్య మాట్లాడుతూ దేశంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద అనేక రకాలుగా దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు.
వాటిని అరికట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. దళితులకు రక్షణ గా ఉన్న చట్టాలను సుప్రీం కోర్టు ద్వారా నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఒకపక్క దళిత చట్టాలను నిర్వీర్యం చేస్తూ మరో పక్క తన చేతులను విడదీసి కుట్రలు చేయడం సరైంది కాదని ఆయన హెచ్చరించారు.
కాలం చెల్లిన ఎస్సీ వర్గీకరణ ను పదే పదే ముందుకు తీసుకొచ్చి మాల మాదిగల మధ్య చిచ్చుపెట్టడం సరైంది కాదన్నారు. రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల్లాంటి మాల మాదిగలను విడదీయడం భావ్యం కాదన్నారు.
ఇప్పటికైనా సుప్రీం కోర్టు ద్వారా దళిత చట్టాలను దళితులను నిర్వీర్యం చేసే కుట్రలను ఆపాలని అన్నారు. లేకపోతే తెలంగాణ మాలమహానాడు ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు గడ్డి రవికుమార్, రాష్ట్ర కోశాధికారి చీమల దారి నాగేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాడం బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.