గీసుగొండ మండలం కొనాయిమాకుల గ్రామంలో రూ.43 కోట్లతో వ్యయంతో నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను శుక్రవారం నాడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తయితే గీసుగొండ మండలంలో 7400, సంగెం మండలంలో 2200, దుగ్గొండి మండలంలో 4500 ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని అన్నారు.
ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడి నష్టపరిహారం అందించామని అన్నారు. రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యం. రైతులను విస్మరించిన గత ప్రభుత్వాలు రైతుల భూములను అక్రమంగా లాక్కున్న చరిత్ర వాళ్ళది. ఇంకా భూసేకరణ చేయాల్సిన భూములను వెంటనే సర్వే చేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించాము అని అన్నారు.
ఇప్పటికే పంప్ హౌజ్ పనులు పూర్తికావచ్చాయని, ఏది ఏమైనా రబీ సాగుకు తప్పకుండా నిరందిస్తామని తెలిపారు. ప్రాజెక్ట్ అనుసంధానంగా ఉన్న చెరువులు, కుంటలు, పిల్ల కాలువలను నింపేందుకు కూడ ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రాజెక్టు నిర్మాణానికి, భూసేకరణకు సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.