పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను నిర్దేశించిన లక్ష్యాలను ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా ధ్వంసం చేశామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం అన్నారు. ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్ పై భారత సైన్యం దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత రాజ్ నాథ్ సింగ్ ఈ ప్రకటన చేశారు. భారతదేశం తన గడ్డపై జరిగిన దాడికి ప్రతిస్పందించే ‘హక్కు’ను ఉపయోగించుకుంది. మా చర్య చాలా ఆలోచనాత్మకంగా చేశాం” అని సింగ్ అన్నారు. 26 మంది పౌరులు మరణించిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి వ్యతిరేకంగా సాయుధ దళాల ప్రతీకార చర్యను ప్రశంసించారు.
“మా అమాయకులను చంపిన వారిని మాత్రమే మేము చంపాము” అని సింగ్ ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 50 మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో అన్నారు. “ఉగ్రవాదుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతో, ఈ చర్య వారి శిబిరాలు, ఇతర మౌలిక సదుపాయాలకు మాత్రమే పరిమితం చేయబడింది” అని ఆయన అన్నారు. భారత సైన్యం ఖచ్చితత్వం, అప్రమత్తత, సున్నితత్వంతో వ్యవహరించిందని సింగ్ అన్నారు. “ఏ పౌర జనాభాను ప్రభావితం చేయకుండా మేము సున్నితత్వాన్ని ప్రదర్శించాము” అని అన్నారు. “‘ఆపరేషన్ సిందూర్’తో, మన దళాలు ఉగ్రవాద శిక్షణా శిబిరాలను నాశనం చేయడం ద్వారా తగిన సమాధానం ఇచ్చాయి. మన సాయుధ దళాల ధైర్యసాహసాలకు నేను సెల్యూట్ చేస్తున్నాను” అని రక్షణ మంత్రి అన్నారు.