కేంద్ర ప్రభుత్వం తీసుకరానున్న విద్యుత్ ముసాయిదా చట్టాన్ని ముమ్మాటికి అడ్డుకుని తీరుతామని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ రంగ సంస్థలను ప్రయివేటికరించాలన్న కుట్రలో ఇదొక భాగమని ఆయన స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టనున్న 2020 విద్యుత్ సవరణ చట్టం పై హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి తనను కలసిన మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును ఆమోదించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బిల్లును వ్యతిరేకంగా తన మనోగతాన్ని వెల్లడించిన అంశాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.
కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే ఈ బిల్లు తో తెలంగాణ లో భారం పడేది మొదట వ్యవసాయ దారులని ఆ తరువాత గృహావినియోగదారులని ఆయన తెలిపారు. ఈ చట్టమే అమలులోకి వస్తే రాష్ట్రంలో ఉన్న 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తారని ఆయన వెల్లడించారు.
అంతే గాకుండా 69 లక్షల గృహా వినియోగాదారులపై అదనపు భారం పడబోతుందాన్నారు. అటువంటి బిల్లును ఏ రకంగా ఆమోదిస్తారని ఆయన ప్రశ్నించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ఈ బిల్లు తో తొలుత తమ అధీనం లోకి తెచ్చుకుని తద్వారా ప్రవేటికరణకు కేంద్రం వ్యూహం రూపొందించిందని మంత్రి ధ్వజమెత్తారు. పైగా రేనబుల్ ఎనర్జీ తో మరింత ప్రమాదం ఎదుర్కోవలసి వస్తుందని ఆయన చెప్పారు.
వారు నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోక పోతే రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి కప్పం కట్టాల్సి వస్తుందన్నారు. అంతర్గత భద్రత ,అంతర్జాతీయ వ్యవహారాలు,దేశ రక్షణ వంటి కీలక రంగాలు వదలి పెట్టి రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న విద్యుత్ రంగం పై పెత్తనం కోసం ఇటువంటి చట్ట సవరణలు తేవడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.