భారత్ దాడులకు సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని పాక్ ప్రధాని షెహబాజ్ అన్నారు. – మోసపూరిత శత్రువు పాకిస్థాన్ లోని 5 ప్రాంతాల్లో దాడులు చేసింది – భారత్ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్ ఆర్మీకి తెలుసు. ప్రత్యర్థి దుష్ట ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయం. భారత్ దాడులు యుద్ధ చర్యలు అని పాక్ ప్రధాని షెహబాజ్ అన్నారు. మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టింది. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు పాకిస్థాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై దాడులు జరిపింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావులేకుండా.. పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ బలగాలు సంయుక్తంగా ఈదాడిని నిర్వహించాయి.