హిందూ ధర్మ ద్రోహులు నటించిన పఠాన్ సినిమాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకొని తీరుతామని బజరంగ్ దళ్ హెచ్చరించింది. నిరంతరం హిందూ ధర్మంపై విషం చిమ్మే దేశద్రోహులను.. వారి సినిమాలను అడ్డుకొని తీరుతామని బజరంగ్ దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి హెచ్చరించారు. ఈ మేరకు బుధవారం వారు ఓ ప్రకటన విడుదల చేశారు. హిందూ ధర్మానికి ప్రతీక అయిన కాషాయం రంగును పఠాన్ సినిమా లో అత్యంత అవమానకరంగా చిత్రీకరించి, హిందువుల మనోభావాలు గాయపరిచేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు.
పఠాన్ సినిమా విడుదలైన రోజునే దేశవ్యాప్తంగా అడ్డుకున్నామని.. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో అడ్డుకున్నామని తెలిపారు. పోలీసులను రక్షణగా పెట్టి సినిమా థియేటర్లు నడిపించాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ దేశ సంపదతో ఈ దేశ ప్రజలను.. హిందూ ధర్మాన్ని కించపరిచే నటీనటులకు బజరంగ్ దళ్ బుద్ధి చెబుతుందన్నారు. గురువారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పఠాన్ సినిమా ఎక్కడ కూడా వేయవద్దని థియేటర్ల యజమానులకు వారు సూచించారు. హిందువుల సంపదతో లబ్ధి పొందిన షారుక్ ఖాన్.. హిందువుల వినాశనం కోరుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాను చూడవద్దని హిందువులకు వారు సూచించారు.