నెల్లూరు జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంటుందని నెల్లూరు ఎంపీ రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం బుచ్చిలో వైసిపి పార్టీ కార్యాలయ భవనాన్ని రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైయస్ హయాంలో 11 కు 11 అసెంబ్లీ స్థానాలు గెలిచామని, జగన్ మోహన్ రెడ్డి హయాంలో కూడా అన్ని స్థానాలు గెలిచామని, మళ్లీ అదే ఫలితాలను పొందబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైసిపి చాలా మంచి స్థితిలో ఉందని పేర్కొన్నారు. అయినా ఎల్లో మీడియా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. విశాఖ పారిశ్రామిక సదస్సులో నెల్లూరు జిల్లాకు కూడా 4 పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. రామయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయని, తద్వారా జిల్లాకు మేలు జరగనుందని అభిప్రాయపడ్డారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి గడపగడపకు కార్యక్రమంలో అద్భుత ఫలితాలు రాబట్టారని, బహుశా రాష్ట్రంలో ఆయనే ప్రధముడు కావచ్చునని ప్రశంసించారు. పార్టీ కార్యాలయానికి సొంత స్థలాన్ని విరాళంగా ఇచ్చిన మున్సిపల్ చైర్ పర్సన్ సుప్రజా, ఆమె భర్త మురళి లను అభినందించారు. అంతకుముందు అతిథులకు ఘన స్వాగతం లభించింది.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదా మస్తాన్ రావు, ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో బుచ్చి మండల వైసీపీ నేతలు మల్లారెడ్డి, సతీష్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మూర్ల సుప్రజ, మురళి, చీర ప్రసాద్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్, వీరి చలపతిరావు, ఆప్కాబ్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు తదితరులు పాల్గొన్నారు.