పది రూపాయల మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయలు జరిమానా కట్టవలసి వస్తుందని జిల్లా కలెక్టర్ శరత్ కుమార్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ శరత్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో లాక్ డౌన్ అమలులో ఉన్నందున రాత్రి 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు.
ప్రతి ఒక్కరు విధిగా మాస్క్ ధరించాలని సూచించారు. ఈ నెల 29 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుందని, ప్రజలు అనవసరంగా బయటకు రావద్దని తెలిపారు. వైద్యం కోసం తప్ప ఎవరు బయటకు రావద్దని సూచించారు. కామారెడ్డి జిల్లా అధికారికంగా ఆరెంజ్ జోన్లో ఉన్నా గ్రీన్ జోన్లో ఉన్నట్టేనని తెలిపారు.
జిల్లాలో ఆఖరి పాజిటివ్ కేసు 12 ఏప్రిల్ న నమోదు అయ్యిందని, గత 27 రోజులుగా ఒక్క పాసిటీవ్ కేసు నమోదు కాలేదన్నారు. పట్టణ ప్రాంతాల్లో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరవడం జరుగుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి మన జిల్లా వారు 713 మంది వచ్చారని, వారికి స్టాంప్ వేసి హోం క్వారంటైన్లో ఉంచామని చెప్పారు.
చురుకుగా సాగుతున్న ఉపాధి పనులు
జిల్లాలో లక్ష 99 వేల మంది కూలీలతో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఉపాధి హామీ పనుల్లో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అలాగే ఓపి సేవలలో కూడా రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు.
జిల్లాలో కొనుగోలు కేంద్రాల ద్వారా లక్ష 70 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని వెల్లడించారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న 15 గ్రామాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. లాక్ డౌన్ సడలింపులిచ్చినా కరోనా ఉందన్న విషయం మరిచిపోవద్దని ప్రజలకు సూచించారు.
ప్రజలు బయటకు వచ్చే అవసరాలను తగ్గించుకోవాలన్నారు. అనవసరంగా బయటకు వస్తే కేసులు నమోదు అవుతాయని చెప్పారు. జిల్లాలో పెళ్లిళ్లకు అనుమతుల కోసం వస్తున్నారని 50 మందికి మించి పెళ్లికి అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అంతకుమించి జనాలు వస్తే తప్పకుండా కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేష్ దొత్రే, అసిస్టెంట్ కలెక్టర్ తేజాస్ నందన్ లాల్ పవార్ పాల్గొన్నారు.