నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగం మూల కణాల జీవశాస్త్రం లో వర్తమాన భవిష్యత్ అవకాశాలు అనే అంశంపై అంతర్జాతీయ వెబినార్ ను నేడు నిర్వహించారు. ఈ వెబినార్ కు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఉన్నత విద్యా పాలక సంస్థ చైర్మన్ ఆచార్య కె. హేమచంద్రా రెడ్డి పాల్గొని వెబినార్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ శాస్త్ర, సాంకేతిక విభాగంలో అత్యంత వేగంగా పలు ఆసక్తి కరమైన పరిశోధనలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ వెబినార్ ద్వారా ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి లో మూల కణాల అంశంలో జరుగుతున్న శాస్త్రీయ పరిశోధనలను తెలుసుకోవటానికి మంచి అవకాశమని అన్నారు. రాష్ట్రంలోని వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న విశ్వవిద్యాలయాలలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం కూడా ఒకటి అని అన్నారు.
ముఖ్యంగా బయోటెక్నాలజీ విభాగంలో పనిచేస్తున్న అధ్యాపకుల పనితీరు, నిబద్ధత, అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు. సొంతంగా వివిధ జాతీయ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి సుమారు ఐదు కోట్ల నిధులను గ్రాంట్స్ రూపంలో సమీకరించి అద్భుతమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకున్నారని కొనియాడారు.
వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన తను కూడా ఈ వెబినార్ ద్వారా మూల కణాల గురించి తెలుసుకోవటానికి ఎంతో ఆసక్తిగా వున్నానని అన్నారు. వెబినార్ నిర్వాహకురాలు డా. చదిపిరాళ్ల కిరణ్మయి వెబినార్ విషయాలను వివరించారు. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ లోని మియామి విశ్వవిద్యాలయ అధ్యాపకులు డా. చార్లెస్ హూంగ్ ” బియోమెడికల్ వ్యూహాల నుపయోగించి మూల కణాలతో మృదులాస్థి కణజాలం లో మార్పులు చేయటం ” అనే అంశం పై తన పరిశోధన అనుభవాలను పంచుకున్నారు.
తదనంతరం, ఫ్లోరిడా నోవా విశ్వవిద్యాలయ అధ్యాపకురాలు డా. ఉమాదేవి కందలమ్ ” ప్రీప్రోగ్రామ్మింగ్ చేయబడిన చిగురు మూల కణాల ద్వారా ఎముకల మూలుగును పునరుత్పత్తి చేయటం” అనే అంశం మీద విపులంగా చర్చించారు. యం జి హెచ్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకుడు డా. పవన్ కుమార్ రెడ్డి ” రక్త మూల కణాలలో జరుగు సిగ్నలింగ్ విధానాల మీద మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య ఎం. చంద్రయ్య, రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి, బయోటెక్నాలజీ విభాగాధిపతి ఆచార్య జి. విజయానంద కుమార్ బాబు, బయోటెక్నాలజీ అధ్యాపకులు, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులు, పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.