ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరు? ఇంకెవరు రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్. నమ్మకం లేదా? ఒక్క సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్ చూడండి. ఆయన పేరే ఉంది. రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ నియామకానికి ఆలంబన అయిన ఆర్డినెన్సును రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది.
అందుకు సంబంధించిన జీవోలు కూడా రద్దయ్యాయి. ఎన్నికల కమిషనర్ గా డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ కు ఉద్వాసన పలకడం కోసం ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సును కొట్టేయడంతో ఆటోమేటిక్ గా అప్పటి కే నియమితుడై ఉన్న డాక్టర్ ఎన్. రమేష్ కుమార్ కొనసాగుతున్నట్లుగా అర్ధం వస్తుంది.
అయితే హైకోర్టు ఆ విధంగా చెప్పలేదని, తాము మరింత క్లారిటీ కోసం సుప్రీంకోర్టుకు వెళతామని రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనూహ్యంగా తెరపైకి వచ్చి హైకోర్టు తీర్పుపై తన దైన శైలిలో వ్యాఖ్యానం చేశారు. నేడు సుప్రీంకోర్టు రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.
అంటే ఆర్డినెన్సు రద్దు అయినట్లే భావించాలి. తదుపరి విచారణ కొనసాగుతుంది కానీ ఆర్డినెన్సు రద్దుపై స్టే ఇవ్వకపోవడం అంటే రమేష్ కుమార్ ను కొనసాగించడమేనని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇప్పటి వరకూ సుప్రీంకోర్టు లో నేడు జరిగిన పరిణామాలపై అధికారికంగా వ్యాఖ్యానించలేదు.
ఇదంతా ఒక వైపు జరుగుతుండగానే మరో వైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా జస్టిస్ వి కనగరాజ్ ఉన్నట్లు అధికారిక వెబ్ సైట్ తెలుపుతున్నది. ఈ హడావుడిలో వెబ్ సైట్ ను అప్ డేట్ చేయలేదేమో అని కొందరు అనుకోవచ్చు. అయితే వెబ్ సైట్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించిన సెక్రటరీ పేరును వెబ్ సైట్ లో పేర్కొన్నారు. అందుకే అధికారిక వెబ్ సైట్ హైకోర్టు తీర్పును పెద్దగా పట్టించుకోలేదని అర్ధం చేసుకోవచ్చు.