అన్ని రంగాల లోని హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు డిమాండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని SWC గోదాము హమాలి కార్మికుల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న యాదగిరి రావు మాట్లాడుతూ అన్ని రకాల గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు వెల్ఫేర్ బోర్డు లేక పి.ఎఫ్,ఇ.ఎస్.ఐ సౌకర్యాలు అమలుకు నోచుకోక కుటుంబాలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
వృద్ధాప్యంలో అనారోగ్యానికి గరై పడరాని పాట్లు పడుతున్నారని,55 సంవత్సరాలు నిండిన హమాలి కార్మికులకు నెలకు 5000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం లోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్,డీజిల్,వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచటం ద్వారా వాటి ప్రభావం వలన నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి ఆకాశాన్ని తాకటంతో సామాన్యుల బ్రతుకు జీవనం ఛిద్రమైందని అన్నారు.
ఆకాశమే హద్దుగా నిత్యం పెరుగుతున్న అధిక ధరలను అరికట్టాలని,కరోనా సమయంలో కార్మికులకు నెలకు 7500 రూపాయలు నగదు బదిలీ చేయాలని అన్నారు. అన్ని రకాల నిత్యావసర వస్తువులు 6 నెలల పాటు ఉచితంగా ప్రభుత్వం అందజేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, రైస్ మిల్లు డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు గుండెబోయిన వెంకన్న, హమాలి యూనియన్ అధ్యక్షుడు మోతుకూరి వేంకటేశ్వర్లు,మల్సూరు, రాములు నాయక్, కోటేశ్వరరావు,రాములు, హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.