శాసనమండలి ఎన్నికలలో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకుని రేవల్లి మండలంలో ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వెళ్తున్న రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి ఒక ఆసక్తికరమైన సంఘటన ఎదురైంది. రేవల్లి మండలం గొల్లపల్లి సమీపంలో రేవల్లి పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు వెళ్తున్న చీర్కపల్లికి చెందిన పట్టభద్రురాలు తలారి మహాలక్ష్మి ఎదురై మంత్రి వాహనశ్రేణిని గమనించి ఆపింది.
మహాలక్ష్మిని గమనించిన మంత్రి నిరంజన్ రెడ్డి వాహనం దిగిన వెంటనే తన మూడునెలల పసికందును చేతులలో పెట్టింది మహాలక్ష్మి. ఎక్కడికి వెళ్తున్నారని మంత్రి ప్రశ్నించగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నాను అని చెప్పడంతో మంత్రి ఆశ్చర్యపోయి అభినందించారు. మూడు నెలల చంటి పాప ఉన్నా బాధ్యతతో ఓటు హక్కును వినియోగించుకుంటున్న మహాలక్ష్మి అందరికీ ఆదర్శం అని, పౌరులుగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకుని ప్రజాస్వామ్య స్ఫూర్థిని చాటిచెప్పాలని అన్నారు.