నాలుగేళ్లలో ఏం పని చేశామని ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడుగుతాం? అని నెల్లూరు జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. కండలేరు రిజర్వాయర్ దగ్గరే ఉన్నా రాపూరులో ఒక్క చెరువులో నీళ్లు నింపలేకపోయామని పేర్కొన్నారు.
కండలేరు అభివృద్ధి విషయంలో వైఎస్సార్ కల నెరవేర్చలేకపోయామని ఆనం విచారం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కలను నెరవేర్చలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం అంటూ తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ఎస్ఎస్ కెనాల్ కడతామని ఎన్నికల వేళ హామీ ఇచ్చామని, ఇన్నేళ్లయినా కెనాల్ గురించి పట్టించుకోలేదని అన్నారు.
గ్రామాల్లో ప్రజలకు బిందెడు నీళ్లు ఇవ్వలేని స్థితిలో ఉన్నామని, ఎస్ఎస్ కెనాల్ గురించి ముఖ్యమంత్రికి ఎన్నోసార్లు చెప్పామని, అసెంబ్లీలోనూ ప్రస్తావించామని, చీఫ్ ఇంజినీర్ల భేటీలోనూ ప్రస్తావించామని ఆనం వెల్లడించారు. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఎస్ఎస్ కెనాల్ పరిస్థితి ముందుకు కదల్లేదని పేర్కొన్నారు.
కంటి ముందు నీళ్లున్నాయని సంతోషపడడమే తప్ప నీళ్లు తాగలేని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రజలు తనను కూడా నమ్మే పరిస్థితి లేదన్నారు.