తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సడెన్గా ఒక మాజీ పోలీస్ అధికారి పేరు తెరపైకి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఆ ఉద్యోగిని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోవడంతో పాటు.. ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఆమె ఆచూకీ తెలుసుకుని.. సీఎంను కలవాలంటూ మాజీ డీఎస్పీ నళినికి కబురు పంపారు. నేరుగా సీఎం పిలవడంతో ఆమె రేవంత్రెడ్డిని కలిశారు. నళినికి పోలీస్ శాఖలో గతంలో ఆమె పనిచేసిన హోదాకు తగ్గకుండా ఉద్యోగం ఇచ్చేందుకు ప్రతిపాదించగా.. నళిని తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె అధ్యాత్మిక మార్గంలో ఉన్నానని, ఉద్యోగం చేసుందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. పోలీస్ ఉద్యోగానికి అవసరమైన ఫిట్నెస్తో తాను లేనని చెబుతూ.. ప్రభుత్వం సహాయం చేయాలనుకుంటే వేద విద్య ప్రచారం కోసం సహాయం చేయాలని అడిగారు. దీనికి సంబంధించి రెండు వినతిపత్రాలను సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. నళిని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి దాదాపు 7 నెలలు అవుతున్నా.. ఆమె చేసిన వినతులపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఆమె మరోసారి ప్రభుత్వానికి లేఖ రాశారు. కొంచెం ఘాటైన పదాలను ఉపయోగిస్తూ ఆమె లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
నళిని రాసిన లేఖ ఇదే..
ప్రభుత్వానికి తాను అందించిన వినతిపత్రాలపై సానుకూల స్పందన రాకపోవడంతో సామాజిక మాద్యమం ఫేస్బుక్లో ఆమె ఒక పోస్టు పెట్టారు. తనను పీఆర్ స్టంట్ కోసం వాడుకొని వదిలేశారని మాజీ పోలీస్ అధికారి నళిని ఆవేదన వ్యక్తం చేశారు. యాచకులకు ఇచ్చిన విలువ కూడా తనకు రేవంత్ ప్రభుత్వంలో ఇవ్వడంలేదన్నారు. రేవంత్ రెడ్డి సీఎం కొలువుకు ఎక్కగానే తనకు ఎక్కువ ప్రచారం కల్పించారని.. ఇప్పుడేమో చప్పుడే చేస్తలేదని నళిని పోస్టులో పేర్కొన్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు జరిగిన సందర్భంలోనూ నా వూసే ఎత్తకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇంతకీ తన రెండు దరఖాస్తులు బల్ల మీదనే ఉన్నయో లేక చెత్త బుట్టలోకి పోయినవో అనే అనుమానం కలుగుతుందన్నారు. సీఆర్వో, ఓఎస్డీకి ఓ లేఖ రాశానంటూ ఆమె ఫేస్బుక్ పోస్టులో పేర్కొన్నారు.