బిజెపి అధికారంలోకి వస్తే 50 రూపాయలకే మందు సరఫరా చేస్తామని ప్రకటించిన బిజెపి ఏపి అధ్యక్షుడు సోము వీర్రాజు ఆ నాటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అక్రమాలు చేస్తున్న అధికార పార్టీని కాకుండా కమ్యూనిస్టులను బండబూతులు తిట్టిన సోము వీర్రాజు ఆ నాడు చేసిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు ఎదురయ్యాయి. బిజెపి అంటే సానుభూతి ఉన్న వారు కూడా అసహ్యించుకున్నారు.
అధికారంలోకి రావడం అటుంచి సాంప్రదాయ ఓటర్లు కూడా బిజెపి అంటే చీదరించుకున్నారు. ఆ తర్వాత గుంటూరులోని చారిత్రాత్మక జిన్నా టవర్ పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ జాతిపిత పేరు గుంటూరులో ఎందుకు ఉందని చరిత్ర పూర్తిగా మర్చిపోయి ఆయన ప్రశ్నించి మరొక్క సారి వివాదాల్లోకి ఎక్కారు. తాజాగా ఆయన దృష్టి విశాఖ మహానగరంలో కేజీహెచ్ ఆస్పత్రి పై పడింది. కేజీహెచ్ అంటే కింగ్ జార్జి హాస్పిటల్… కాగా .‘‘అసలు కింగ్ జార్జ్ ఎవరు… ఇందులో కింగ్ ఎవరు..? జార్జ్ ఎవరు..?’’ వెంటనే ఈ పేరు మార్చాలని డిమాండ్ చేశారు.
విశాఖ మహానగరంలో కేజీహెచ్ ఆస్పత్రి పేరు వెంటనే మార్చాలంటూ సరికొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు అంతటితో ఆగని ఆయన.. కేజీహెచ్ ఆస్పత్రికి ఏం పేరు పెట్టాలో కూడా సెలవిచ్చారు. కేజీహెచ్ను ‘సర్ధార్ గౌతులచ్చన్న’ పేరు బీజేపీ ప్రతిపాదిస్తోందని చెప్పుకొచ్చారు. ఇక్కడ త్యాగశీలుర పేర్లు పెట్టాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. అయితే తాజా ప్రకటనతో మరోసారి అటు మీడియాలో.. ఇటు నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతున్నారు.