రూ.1.99 లక్షల కోట్లు ఏమయ్యాయో సీఎం జగన్ చెప్పాలి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత అప్పులుగా తీసుకున్న డబ్బులో రూ.1.99 లక్షల కోట్లు ఏమయ్యాయో చెప్పాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ డిమాండ్ చేశారు.
ఈ రెండున్నర సంవత్సరాలలో ముఖ్యమంత్రి జగన్ రూ.2,68,335 కోట్ల అప్పు చేస్తే అందులో రూ.68,632 కోట్లే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ప్రజలకు అందించారని, మిగిలిన రూ.1.99 లక్షల కోట్లు ఏం చేశారనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు.
రెండేళ్లలో పెట్టుబడి వ్యయం కోసం ఖర్చు చేసింది రూ.31 వేల కోట్లు మాత్రమేనని, లెక్కల్లో చూపని రూ.1.99 లక్షల కోట్లలో రూ.31వేల కోట్లు తీసేసినా రూ.1.68 లక్షల కోట్లకు సంబంధించిన లెక్కలేవి? అని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రం మొత్తం మీద స్టేట్ హైవేలుగా గుర్తించిన రోడ్లు 14,714 కిలోమీటర్ల పొడవున ఉండగా అందులో 99 రోడ్లు బాగా శిథిలమయినట్టు ఆర్ అండ్ బీ అధికారులు గుర్తించారని, వాటితో పాటుగా జిల్లాల్లో మేజర్ రోడ్లను కూడా ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారని, కానీ ప్రస్తుతం ఏపీలో ఆర్ అండ్ బీ శాఖ రోడ్ల మీద చేస్తున్న వ్యయం జాతీయ సగటుతో పోలిస్తే తక్కువే ఉందని శైలజనాథ్ వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో రోడ్లు, వంతెనల కోసం 1.7 శాతం మాత్రమే కేటాయించారని, ఇది వివిధ రాష్ట్రాల సగటు 4.3 శాతంతో పోలిస్తే చాలా తక్కువగా ఉందన్నారు.