ఎప్పుడు ఢిల్లీకి కలిసే వెళ్లేవారు. ఎవరిని కలవాలన్నా ఒకే కారులో వెళ్లేవారు. కానీ ఇప్పుడు అలా జరగలేదు. ఒకరు ముందు ఢిల్లీకి వెళ్లి వచ్చాక మరొకరు పయనమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కలిసి ఢిల్లీకి వెళ్లే సంప్రదాయానికి బ్రేక్ పడింది. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విడివిడిగా ఢిల్లీకి వెళ్లడంతో తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠత రేపింది. భట్టి ఈ సారి ఒంటరిగా వెళ్లి ఢిల్లీలో రాహూల్ గాంధీతో సమావేశమై రాష్ట్రంలోని తాజా పరిణామాలను వివరించడంతో పాటు మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించనట్లు సమాచారం.
ఇటు బంధువుల పెళ్లికి రాజస్థాన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అటు నుంచి ఢిల్లీకి వచ్చే సరికి భట్టి విక్రమార్క ఢిల్లీ టూర్ ముగించుకొని హైదరాబాద్ వచ్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తి చేసుకుంది. విజయోత్సవాలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. వాటి వివరాలతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, కులగణన వంటి ముఖ్యమైన అంశాల్ని అధిష్టానం పెద్దలకు వివరించాల్సి ఉంది. ఇలాంటి కీలక టైమ్లో రేవంత్, భట్టి విడివిడిగా ఢిల్లీకి ఎందుకు వెళ్లారన్నదానిపైనే చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాలపై అధిష్టానంతో చర్చించాల్సి ఉంది.
అయితే రేవంత్ రెడ్డి కంటే ముందే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఒక్కరే రాహూల్ గాంధీని కలిసి ఈ అంశాలపై చర్చించడం అసక్తికరంగా మారింది. అందులోను సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ మొదలయ్యే సమయానికి భట్టి విక్రమార్క హైదరాబాద్ వచ్చేశారు. దీంతో అధిష్టానం పెద్దలతో చర్చించాల్సిన మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ వంటి అంశాల్లో సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఏకాభిప్రాయం కుదరలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్యాబినెట్లో చోటు కోసం ఎవరికి వారు తమ తమ వర్గాల ఎమ్మెల్యేల పేర్లను అధిష్టానానికి సిఫార్సు చేస్తున్నారని తెలుస్తోంది.
ఈ కారణంగానే సీఎం రేవంత్ రెడ్డి కంటే ముందే భట్టి విక్రమార్క ఢిల్లీ వెళ్లి రాహూల్ గాంధీని కలిశారని టాక్ వినిపిస్తోంది. గతంలో ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా దొరకలేదట. ఇక చేసేదేమిలేక రేవంత్ సైలెంట్గా తిరిగొచ్చారు. కానీ ఇప్పడు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు రాహుల్ అడగానే అపాయింట్మెంట్ ఇచ్చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ మొదలైంది. ఐతే ఈ ప్రచారాన్ని గాంధీ భవన్ వర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యక్రమాలు, షెడ్యూల్ వల్లే ఈసారి భట్టితో కలిసి వెళ్లలేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.