బిజెపికి ప్రత్యర్థి పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులపై తెలంగాణ లో ఐటి దాడులు జరిగితే రాజకీయ కక్షసాధింపు చర్య అనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. మరి బిజెపికి మిత్రపక్షమైన వైసీపీ అధికారంలో ఉన్న ఆంధ్రాలో ఆ పార్టీ నేతలపైనే ఐటి దాడులు జరిగితే? జరిగితే కాదు… జరిగాయి. దాంతో ఇది ఒక కులం నాయకులు పన్నిన కుట్ర అంటూ ప్రచారం చేస్తున్నారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు తాజాగా చేపట్టిన దాడులు ఆంధ్రాలో కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లో వంశీరామ్ రియల్ ఎస్టేట్ అండ్ బిల్డర్స్ కంపెనీ, దాని యజమానుల నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు పెద్ద ఎత్తున జరిగాయి. దీనితో బాటు ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఇంటిపై కూడా ఇంతే స్థాయిలో ఐటి అధికారుల దాడులు చోటు చేసుకున్నాయి.
ఐటీ దాడులను ఎదుర్కొంటోన్న వ్యక్తులు, సంస్థలకు రాజకీయాలతో సంబంధం ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. వంశీ రామ్ బిల్డర్ సుబ్బారెడ్డి, ఆయన బావమరిది జనార్దన్ రెడ్డి ఐటీ అధికారుల రాడార్లో ఉన్నారు. మొత్తం 18 చోట్ల సోదాలు ఏకకాలంలో జరిగాయి. ఈ సందర్భంగా అధికారులు కొన్ని కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వంశీరామ్ బిల్డర్స్తో వ్యాపార పరమైన సంబంధం ఉండటమే దేవినేని అవినాష్ నివాసంపై దాడులకు కారణమైందని కూడా అంటున్నారు.
ఈ దాడులకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ అధికారుల నుంచి అధికారిక ప్రకటన ఇంకా విడుదల కావాల్సి ఉంది. కాగా దేవినేని అవినాష్ ఇంటిపై ఆదాయాపు పన్ను శాఖ అధికారులు దాడి చేశారనే విషయం తెలియగానే వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయవాడ గుణదలలోని నివాసానికి చేరుకున్నారు. దేవినేని అవినాష్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. వారిని పోలీసులు చెదరగొట్టడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఈ దాడుల వెనుక భారతీయ జనత పార్టీ నాయకులు ప్రమేయం ఉందని దేవినేని అనుచరులు ఆరోపించారు. కేంద్రంలో ఉన్న వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి సుజన చౌదరి ఇతర నాయకుల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. కృష్ణాజిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగిన దేవినేని అవినాష్ను రాజకీయంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేయించారని ధ్వజమెత్తారు. తమ చేతుల్లో ఉన్న ఈడీ, ఐటీ, సీబీఐలను ప్రయోగిస్తోన్నారని విమర్శించారు.