రాష్ట్రంలో ( కోవిడ్-19) వైరస్ అంతకంతకు విస్తరిస్తూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కొందరు పౌరుల అతిచేష్టల వల్ల కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. వచ్చేనెల 7వరకు కరోనా ఫ్రీ రాష్ట్రంగా మార్చేందుకు కేసీఆర్ సర్కార్ శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఈమేరకు సీఎం ప్రెస్ మీట్ లోనూ ప్రకటించారు. అదీగాక కరోనా కట్టడి కోసం లాక్ డౌన్ ప్రకటించినా ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రజలు లాక్ డౌన్ విషయంలో అశ్రద్ధ వహిస్తే ఆర్మీని రంగంలోకి దింపి అవసరమైతే షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇష్యూ చేస్తామని చెప్పినా పౌరుల్లో కనీస స్పృహ లేకుండా పోతోంది.
వద్దు అన్న పనిని ఖచ్చితంగా చేసే అలవాటు ఉన్న కొందరు వ్యక్తులు ప్రాణాలు తీస్తున్న కరోనా విషయంలోనూ అదే నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కనిపిస్తుంది. క్రమంగా పెరుగుతున్న కేసులను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టం అవుతోంది. ఒక్క కేసుతో మొదలైన ఈ మహమ్మారి నేడు 70కి పెరిగింది.
అయినా ప్రజల్లో మాత్రం అవగాహన రావడం లేదు. తాజాగా కరోనా అనుమానిత కేసులు మెదక్ లోనూ బయటపడ్డట్లు సమాచారం. మెదక్ పట్టణంలో నలుగురు కరోనా అనుమానితులను ఆస్పత్రికి తరలించారు. వీరంతా బయటి దేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.
వారినుండి శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్ కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా అనుమానితులను ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
ఇప్పటికైనా ప్రజలు స్పందించి కరోనా కట్టడికోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ కు కట్టుబడి ఉంటే ఈ మహమ్మారిని త్వరలోనే అంతం చేయచ్చు. జిల్లాలో ఇప్పటి వరకు 10మందికి కరోనా లక్షణాలు ఉన్నాయని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.