సోమశిల సిద్దేశ్వరం వంతెన కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక. సుమారు 23 సంవత్సరాల నుండి వంతెన నిర్మాణం జరుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర ప్రాంతానికి అతి తక్కువ సమయంలో రాకపోకలు సాగించవచ్చు.
ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే ప్రమాదకరమైన పుట్టి ప్రయాణం ముగుస్తుంది. ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల కొల్లాపూర్ నియోజకవర్గ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. అయితే ఈ వంతెన రాజకీయ నాయకులకు ఉపయోగపడుతున్నది తప్ప వాస్తవ రూపం దాల్చడంలేదు.
నన్ను గెలిపిస్తే ఈ వంతెన నిర్మిస్తాను అంటే ఈ ప్రాంత నాయకులంతా ఏ ఎన్నిక వచ్చినా హామీ ఇస్తునే ఉంటారు. తీరా గెలిచిన తర్వాత షరా మామూలే. ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కూడా ఇందుకు మినహాయింపు కాదు. కేసీఆర్ వస్తారు…శంకుస్థాపన చేస్తారు అని చెప్పడమే కానీ ఆయన రావడంలేదు, శంకుస్థాపన చేయడం లేదు.
కొందరు ఈ వంతెన పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లక్షలాది రూపాయలు సంపాదించారు. ఇప్పటికి వంతెన వస్తే రేటు డబల్ అవుతుందని జనాలకు ఆశ చూపెడుతూ రియల్ వ్యాపారం కొనసాగిస్తున్నారు. 2007లో కృష్ణానదిలో పుట్టి మునిగి 60మందికి పైగా చనిపోయారు.
మరోసారి ఈ సంఘటనలు జరగకుండా సోమశిల సిద్దేశ్వరం వంతెన ఏర్పాటు చేయాలని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు. బడ్జెట్ కేటాయించారు. 2009 లో సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చారు.
వంతెన ఏర్పాటుకు అప్పటి మంత్రి జూపల్లి బడ్జెట్ ను అధికం చేశారు. అనంతరం జరిగిన పరిణామాలతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయాయి. తెలంగాణ రాష్ట్రం 2014 లో ఏర్పడింది. అప్పటికే జూపల్లి కృష్ణారావు మంత్రిగా కొనసాగారు. వంతెన ఏర్పాటుకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలో చర్చకు తీసుకొచ్చారు.
అప్పుడు ఏ సమాధానం వచ్చిందో మళ్లీ ఇప్పుడు ఆరేళ్ల తర్వాత అదే సమాధానం వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సోమశిల సిద్దేశ్వరం వంతెన ఎజెండాగానే కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గా గెలిచారు. రెండు నెలలకే టీఆర్ఎస్ పార్టీ లోకి వలస వెళ్లారు. వంతెనపై హామీ తీసుకొని పార్టీలోకి వెళుతున్నారని తెలిపారు.
సోమశిల సిద్ధేశ్వరం వంతెన కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అంటూ అసెంబ్లీలో ప్రస్తావించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వంతెన ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా మేలు జరుగుతుంది కాబట్టి ఆ రాష్ట్రం కూడా తన వంతు వాటా ఇస్తే నిర్మాణం ప్రారంభిస్తామని సమాధానం ఇచ్చారు.
గతంలో ఇప్పటి మాజీ మంత్రి జూపల్లి అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఇదే సమాధానం వచ్చింది. వంతెన ఏర్పాటు చేస్తామని హామీ లేదు. ఒక వేళ ముఖ్యమంత్రులకు వంతెన ఏర్పాటు చేయాలి అనే ఆలోచన ఉంటే ఇదివరకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కృష్ణా, గోదావరి జలాలకు సంబంధించిన అంశంలో భేటీ అయినప్పుడు దీన్నీ ఆమోదించేవారు.
ఏదీ కాలేదు కానీ బీరం హర్షవర్థన్ రెడ్డి మాత్రం ఇంకా వంతెన వస్తది, ఏర్పాటు చేసి తీరుతామని బల్లగుద్ది చెప్తున్నారు. ఈ ప్రాంత నాయకుల మాటలపై నమ్మకం పోయినందున సీఎం నోట మాట వస్తే ప్రజలకు నమ్మకం వుంటుంది. గత శాసనసభ ఎన్నికల ప్రచారం మాజీమంత్రి జూపల్లి నిర్వహించిన ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ రెవెన్యూ డివిజన్ పై హామీ ఇచ్చారు.
ఇప్పుడు కొల్లాపూర్ రెవెన్యూ డివిజన్ అయింది. సీఎం నోట మాట వస్తే తప్ప వంతెన ముందుకు సాగేలా లేదు. ఇదిలా ఉంటే మరో వైపు భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఎల్లేని సుధాకర్ రావు సోమశిల సిద్దేశ్వరం వంతెనతో పాటు జాతీయ రహదారి ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతుల కొరకు కృషి చేస్తున్నారు.
ఇది వరకు ఆ శాఖకు సంబంధించిన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. కేంద్ర అనుమతులకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఆ శాఖకు సంబంధించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో కూడా హామీ తీసుకవచ్చారు. ఇప్పుడు ఈ మూడు సంవత్సరాలలో సోమశిల సిద్దేశ్వరం వంతెన జాతీయ రహదారి వచ్చే వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని చెబుతున్నారు.
అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సోమశిల సిద్దేశ్వరం వంతెన మాత్రం నిర్మాణం జరగడం లేదు. కేవలం వంతెన అంశాన్ని ముందు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన నాయకులు ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశంపై ప్రస్తావిస్తూ హామీలు ఇస్తూ వచ్చారు.
కానీ వంతెన ఏర్పాటుకు మోక్షం రావడం లేదు. ఇప్పుడు ఆంద్రప్రదేశ్ ప్రభుత్వంపై వంతెన అంశాన్ని ముడికట్టారు. ఇదివరకు జూపల్లి కృష్ణారావుకు ఇదే ఎదురైంది ఇప్పుడు ఎమ్మెల్యేకు ఇదే సమాధానం ఇస్తున్నారు. ఇలా చూస్తే వంతెన ఏర్పాటుకు ప్రభుత్వానికి ఇష్టం లేనట్టు ఉందని స్థానికులు అనుకుంటున్నారు.