ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ కుమార్ వ్యాస్ తెలిపారు. ఢిల్లీ నుండి నితేష్ కుమార్ వ్యాస్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులతో, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నితేష్ కుమార్ వ్యాస్ మాట్లాడుతూ, ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 రూపకల్పనలో భాగంగా అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసుకునేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఓటర్ నమోదు కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి అర్హులకు ఓటు హక్కు కల్పించాలని, విద్యాసంస్థల్లో విద్యార్థులు అందరూ తమ పేరును నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, చేర్పులు, మార్పులు చేసి తుది ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ, 2022 నవంబర్ 9 నుండి 30 నవంబర్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక లక్ష 49 వేల 975 ఫారం -6 దరఖాస్తులు రాగా, 19 వేల 298 దరఖాస్తులు పరిష్కరించడం జరిగిందని, అలాగే ఫారం -7 దరఖాస్తులు 43 వేల 839 స్వీకరించి, 9 వేల 605 డిస్పోజ్ చేయడం జరిగిందని, ఫారం -8 దరఖాస్తులు 38 వేల 762 దరఖాస్తులు స్వీకరించి 7 వేల 782 దరఖాస్తులు డిస్పోజ్ చేయడం జరిగిందని, మిగతా పెండింగ్ దరఖాస్తులు వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. 2 కోట్ల 95 లక్షల 85 వేల నాలుగు ఓటర్ లకు గాను ఒక కోటి 67 లక్షల 91 వేల 349 మంది 6బి ఫారం ఇచ్చి ఆధార్ లింక్ చేసుకోవడం జరిగిందని, 56.76 శాతం ఆధార్ లింక్ దరఖాస్తులలో 42.69 శాతం ఆన్లైన్ ద్వారా, 14.07 ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా స్థాయి నుండి గ్రామ స్థాయిలలో ఓటర్ నమోదు అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టడంతో పాటు పోలింగ్ బూత్ స్థాయిలో ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలిపారు.
సమావేశంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, నవంబర్ 9 నుండి నవంబర్ 30 వరకు ఫామ్ 6 లు 4567, ఫామ్ 7 లు 2073, ఫామ్ 8 దరఖాస్తులు 1863 వచ్చినట్లు, వీటిని పరిశీలించి, పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఆధార్ లింకేజ్ కొరకు 11,23,643 ఓటర్లకు గాను 8,66,401 ఫామ్ 6బి లు స్వీకరించినట్లు తెలిపారు. విద్యా సంస్థలకు ఏఈఆర్వో లను నియమించి, ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు అన్నారు. బూత్ స్థాయి అధికారులచే ఇంటింటి సందర్శన చేసి, యువత, మైగ్రేటెడ్ అయిన ఓటర్లు, క్రొత్తగా వివాహం అయిన యువతులు 20 నుండి 29 సంవత్సరాల వారినుండి ఫామ్ 6 దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తుల పరిష్కారం త్వరితగతిన పూర్తి చేయనున్నట్లు అన్నారు. ఈ వీడియో సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఆర్డీవో రవీంద్రనాథ్, ఎస్డిసి దశరథ్, జిల్లా ఉపాధికల్పనాధికారి శ్రీరామ్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.